Breaking News

18/12/2019

కొనసాగుతున్న రేప్ లు

హైద్రాబాద్, డిసెంబర్ 18 (way2newstv.in)
హైదరాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదొక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కామాంధుల్లో కాస్తయినా భయం ఏర్పడి నేరాలు తగ్గముఖం పడతాయని అందరూ భావించారు. అయితే దానికి వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో రోజూ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే భాగ్యనగరంలో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది.తండ్రితో పాటు అతడు పనిచేసే పరిశ్రమకు వెళ్లిన 11 ఏళ్ల బాలికపై ముగ్గురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
కొనసాగుతున్న రేప్ లు

హైదరాబాద్‌ పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి అలీనగర్‌లోని రంగుల పరిశ్రమలో పనిచేస్తుంటాడు. ఈనెల 13న పనికి వెళ్తూ తన 11 ఏళ్ల కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లాడు. అతడు పనిలో నిమగ్నమై ఉండగా బాలిక పరిశ్రమలో ఒంటరిగా తిరుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన ముగ్గుకు కామాంధులు ఆమెను బెదిరించి సమీపంలోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ దుర్మార్గులు బెదిరించడంతో బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. అయితే మూడు రోజులుగా కుమార్తె మనస్తాపంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు మంగళవారం నిలదీయగా జరిగిన ఘోరం గురించి చెప్పి బోరుమంది. దీంతో ఆమె తండ్రి వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఘటన జరిగిన ప్రాంతం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోనిది కావడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

No comments:

Post a Comment