Breaking News

09/08/2019

సిటీలో యదేఛ్చగా గంజాయి...

హైద్రాబాద్, ఆగస్టు 9, (way2newstv.in)
దేశ విదేశాల నుంచి నగరానికి డ్రగ్స్‌, ఖరీదైన మద్యంతోపాటు రకరకాల మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. ఒడిషా, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి క్వింటాళ్లకొద్దీ గంజాయి నగరానికి చేరుతోంది. సరదాగా అలవాటు చేసుకుంటున్న యువతరం మాదక ద్రవ్యాలకు బానిసగా మారుతోంది. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ తీసుకోవడం వల్ల రాజేంద్రనగర్‌కు చెందిన పండు అనే యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్‌లో మే నెలలో జరిగిన ఘటన నగరంలో సంచలనం రేపింది. శివరాంపల్లి గ్రామనికి చెందిన శివకుమార్‌ చిన్న కుమారుడు పండు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ మధ్యలో మానేసి తన తండ్రికి గల వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. స్నేహితులను చూసి గంజాయి, డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. 
సిటీలో యదేఛ్చగా గంజాయి.....

ఈ క్రమంలో ఓ రోజు సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ మాత్రలు తీసుకోవడం వల్ల మృతిచెందాడు.నైజీరియా దేశానికి చెందిన కొందరు యువకులు టూరిస్టు, స్టూడెంట్‌, విజిటింగ్‌ వీసాలపై భారత దేశానికి వస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో ఎక్కువ మంది డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. కొందరు ముంబాయి, ఢిల్లీ, బెంగళూర్‌లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారుల కంట పడకుండా ప్రయివేట్‌, ఆర్టీసీ బస్సులు, రైళ్లు, కార్లలో నగరానికి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. మరికొన్ని ముఠాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి గోవా, బెంగళూరు, చెన్నైకి తరలిస్తున్నాయి. అక్కడి నుంచి కొకైన్‌, ఇతర మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకొస్తున్నాయి. వాటిని రకరకాల కోడ్‌ భాషల ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాయి. మాదక ద్రవ్యాల సరఫరాలో రాటుతేలిన నైజిరియాకు చెందిన లక్కీ దేశవ్యాప్తంగా ముఠా సభ్యులను విస్తరించాడు. నైజీరియాలోనే ఉంటూ కావాల్సినప్పుడల్లా బెంగళూర్‌, ముంబాయి, హైదరాబాద్‌కు వచ్చిపోతుంటాడు. ఈ ముఠా సభ్యులను కొందరిని కొద్ది రోజుల కిందట ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారితో సంబంధమున్న ఐవరీకోస్ట్‌ దేశానికి చెందిన డివైన్‌ ఎబుకా సుజుతోపాటు టి.అమినాత అనే మహిళను అరెస్టు చేశారు. విజిటింగ్‌ వీసాపై భారత్‌కు వచ్చిన ఎబుకా డ్రగ్స్‌ సరఫరాకు బెంగళూర్‌ను కేంద్రంగా చేసుకున్నాడు. స్నేహితులు, అనుచరులతోపాటు ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. హైదరాబాద్‌లోనూ గ్రాము కొకైన్‌ రూ. 6 వేల నుంచి రూ.7వేల వరకు విక్రయిస్తున్నాడు.మత్తు పదార్థాల సరఫరాపై ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అర్ధరాత్రి తనిఖీలు చేపట్టి దేశ విదేశాల నుంచి నగరానికి సరఫరా చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు కొద్ది రోజుల కిందట ఎబుకా అనుచరుడైన జాన్‌పౌల్‌ను నానక్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. రెండు ముఠాల నుంచి దాదాపు 257 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment