Breaking News

09/08/2019

గ్రీన్...అండ్ కట్

పర్యావరణానికి అటవీ అభివృద్ధి సంస్థ తూట్లు
హైద్రాబాద్, ఆగస్టు 09, (way2newstv.in)
హరితహారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేస్తోంది. విద్యార్థులు సైతం మొక్కలను నాటుతూ.. ఈ క్రతువులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.. ఇలాంటి సమయంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం పచ్చదనానికి తూట్లు పొడిచింది. సహజమైన అడవిని నరికేసింది.  నగరంలోని కొండాపూర్‌ ప్రాంతంలో ఉన్న బొటానికల్‌ గార్డెన్‌లో  15 ఎకరాల్లో ఉన్న వందలాది వృక్షాలను తొలగించింది.గార్డెన్‌లో భారీఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడానికంటూ  అక్కడ 15ఎకరాల మేర ఏపుగా పెరిగిన నీలగిరి, ఇతర చెట్లను నరికేసి భూమిని చదును చేసేశారు. సహజసిద్ధమైన అడవిని నరకడం ఏమిటని బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు.
గ్రీన్...అండ్ కట్

దీంతో ‘ నీలగిరి, సుబాబుల్‌ చెట్లు, తుప్పలను తొలగించి..  ఏగిస, వేప, నెమలినార, రక్తచందనం మొదలైన మొక్కలను నాటడం జరుగుతుంది’ అని బోర్డులు పెట్టారు. ఉదయాన్నే ఇక్కడ పరుగులు పెడుతూ.. వేగంగా నడుస్తూ ..వ్యాయామం చేస్తూ పర్యావరణాన్ని ఆస్వాదించే వారు.. తాజా పరిస్థితిపై నిరసన తెలుపుతున్నారు.కొండాపూర్‌ ప్రాంతం.. ఐటీ సంస్థలతో పాటు అతిపెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు నిలయం. వాహనరద్దీతో ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జామ్‌లు అవుతుండడం సర్వసాధారణం. ఇక వాయు కాలుష్యానికి అంతేలేని పరిస్థితి. ఈ దుస్థితి నుంచి కొంతైనా ఊరట పొందేందుకు పరిసరాల్లో ఉంటున్న వారికి ఏకైక దిక్కు కొత్తగూడ అభయారణ్యం. 274 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మధ్యలోంచి వెళ్లిన 120 అడుగుల రహదారితో కొంత అడవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇందులోనే వంద ఎకరాలకు పైగా ప్రాంతాన్ని బొటానికల్‌ గార్డెన్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. సహజమైన అడవిని కొనసాగిస్తూనే... కొంత మేర ఔషధ మొక్కలను పెంచుతున్నారు.. ఈ గార్డెన్‌లో చుట్టూ ఉదయం వ్యాయామం, జాగింగ్‌, వాకింగ్‌ చేసేవారికి అనువుగా మట్టితో రోడ్డును నిర్మించారు. అంతా బాగుందనుకొంటున్న తరుణంలో ఇక్కడి పర్యావరణానికి అటవీ అభివృద్ధి సంస్థ తూట్లు పొడిచింది.

No comments:

Post a Comment