Breaking News

24/08/2019

ఏపీలో చిల్డ్ బీర్ కు బ్రేక్

విజయవాడ, ఆగస్టు 24 (way2newstv.in - Swamy Naidu)
చిల్డ్ బీర్‌ తాగుతూ ఎంజాయ్ చేద్దామనుకునే బీరుబాబాలకు ఇకపై గుటక పడడం కష్టమే. మద్యం షాప్‌కెళ్లి చల్లని బీరు కొనుక్కుని తాగే అవకాశం ఇకపై లేనట్టే. కూలింగ్ బీర్‌ల అమ్మకాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుండడమే ఇందుకు కారణం. ఏపీలో అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్య విధానంతో చల్లని బీర్ అమ్మకాలకు బ్రేక్ పడనుంది. ఇక నుంచి బీర్‌ను కూడా లిక్కర్ మాదిరిగానే కూలింగ్ లేకుండానే విక్రయించనున్నారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుండడంతో అన్ని షాపుల్లో ఫ్రిడ్జ్‌ల ఏర్పాటు సాధ్యం కాదని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అంతేకాకుండా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే బీర్‌ను కూడా లిక్కర్‌లా కూలింగ్ లేకుండానే విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
ఏపీలో చిల్డ్ బీర్ కు బ్రేక్
లిక్కర్‌కు కూలింగ్ అవసరం లేదు కానీ బీర్‌ అలాకాదు. కూలింగ్ లేకపోతే మందుబాబులు బీర్ తాగేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఫలితంగా ఆ ప్రభావం బీర్ అమ్మకాలపై పడే అవకాశం ఉంది. నూతన విధానం అమల్లోకి వచ్చే నాటికి మద్యం షాపులకు అవసరమైన భవనాల గుర్తింపు, షాపుల్లో అవసరమైన ర్యాక్‌లు, బల్లలు, ఇతర ఫర్నిచర్ సమకూర్చే పనిలో ఎక్సైజ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పడున్న మద్యం షాపుల నిర్వాహకుల నుంచే సామగ్రి సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్‌లు వాళ్లిస్తే తీసుకోవడానికి సిద్ధమేనని, అయితే ఫ్రిడ్జ్‌లకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే తొలిదశలో మద్యం షాపుల సంఖ్యను తగ్గించింది. ఇప్పడు ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహణ చేపట్టనుంది. మద్యం షాపుల్లో చల్లని బీర్ విక్రయాలు నిలిపివేస్తే అమ్మకాలు తాగేవారి సంఖ్య తగ్గడంతో పాటు ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు చాలా తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

No comments:

Post a Comment