Breaking News

01/05/2019

పెను తుఫానుగా ఫణి

విశాఖపట్టణం, మే 1, (way2newstv.in)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారి, ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా ఒడిశావైపునకు పయనిస్తోంది. ఈ తుఫాను మే 3న ఒడిశాలోని గోపాల్‌పూర్-చాంద్ బాలే వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫణి తుఫాను 10 కోట్లపైగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురు, శుక్రవారం రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. విశాఖ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, తీరప్రాంతంలో గంటకు 90 నుంచి 118 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్‌ తెలిపింది. ఈ గాలుల వేగం మే 3 మధ్యాహ్నం గంటకు 175 - 205 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 


పెను తుఫానుగా ఫణి

తీరం దాటే సమయంలోనూ పెను తుఫానుగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా తీరం దాటగానే పెనుతుపాను బలహీనపడి, ఆ తర్వాత పశ్చిమ్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌వైపు వెళ్లి మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఫణి తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పూరికి 650 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశను మార్చుకుని ఒడిశాలోని పూరివైపు కదులుతుందని తెలిపారు. ఫణి ఒడిశా తీరాన్ని తాకే క్రమంలో శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం శ్రీకాకుళం తీరంలోని అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారుల్ని నియమించింది. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గజ ఈతగాళ్లు, జనరేటర్లు, ఇంధనాన్ని అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు సిద్ధంగా ఉన్నారు. కోసిన పంటలు ఉంటే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. అధికారులు, ఉద్యోగులకు శాఖలవారీగా విధులను విభజించి, సెలవులను రద్దు చేశారు. కలెక్టర్‌, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ‘ఫణి’ అతి తీవ్ర తుఫాను ప్రభావంతో తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉంది. తుఫాను గమనంపై స్వయంగా పరిశీలించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు మంగళవారం సాయంత్రం తూర్పు నావికాదళం ప్రకటించింది.

No comments:

Post a Comment