Breaking News

08/05/2019

సమ్మర్ లో జరాభద్రం...

దేశంలో ఎండలు భగభగలాడుతున్నాయి. ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. వడగాల్పులు ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది చిట్కాలను పాటించినట్లయితే సురక్షితంగా వేసవిని గడిపేయవచ్చు. అవేంటో చూడండి మరి. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకండి. ఎండ తీవ్రత తగ్గేవరకు ఇంట్లో ఉండటమే సేఫ్.
కాటన్ లేదా పలుచటి దుస్తులు వేసుకోండి. లైట్‌కలర్స్ ధరించడం మేలు. చేతులను కప్పివేసే షర్టులను ధరించండి. నిద్రపోయే సమయంలో గాలి తేలికగా ఆడేలా దుస్తులు ధరించండి. పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
సాధ్యమైనంత ఎక్కువ నీటిని తాగాలి. శరీరంలోని వేడిని తగ్గించేందుకు, వేడి వల్ల కలిగే ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు నీరు సహకరిస్తుంది.
రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లయితే రోజుకు ఒక గ్యాలన్ నీరు తీసుకోవాలి.


సమ్మర్ లో జరాభద్రం...

బరువు ఎక్కువగా ఉండేవారు ఎక్కువ నీరు తాగాలి.
మద్యపానం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కాబట్టి.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మద్యానికి దూరంగా ఉండండి.
సూర్య కిరణాలు నేరుగా ఇంట్లోకి రాకుండా డోరు కర్టెన్లు వేసి ఉంచండి.
వేడి తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో వ్యాయామాలు చేయొద్దు.
ఎండలో పార్క్ చేసి ఉన్న కారులో చిన్నారులను వదిలి వెళ్లకండి. అలా చేస్తే చిన్నారుల ప్రాణాలకే ముప్పు.
ఎండల్లో పిల్లలను ఆటలకు పంపవద్దు.
వాంతులు, తల తిరగడం వంటివి ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్‌ను కిటికీ ఎదురుగా పెట్టండి. కిటికీ నుండి వచ్చే వేడి గాలి బయటకు వెళ్లేలా ఫ్యాను గాలి ఉండేలా చూడండి. లేకపోతే, అది బయట ఉన్న వేడిగాలిని గదిలోకి పంపి హీట్‌ను మరింత పెంచుతుంది.
ఎండలోకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి.
పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
వేసవిలో పరిశుభ్రత చాలా అవసరం. చెమట గ్రంథులు మూసుకుపోతే శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతింటుంది.
చర్మంపై వ్యర్థాలు పేరుకుపోయి చెమట పొక్కులు, సెగగడ్డలు ఏర్పడవచ్చు.
వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. ఆ ఆహారాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మాంసాహారంతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి. లేనట్లయితే.. కలరా, టైఫాయిడ్‌, కామెర్లు వంటి వ్యాధులు వ్యాపిస్తాయి.
శీతల పానీయాల్లో వాడే ఐస్ ముక్కలు అపరిశుభ్రమైన నీటితో తయారు చేస్తారు. కాబట్టి.. అటువంటి పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది.
గది చుట్టూ చల్లటి గుడ్డలు వేలాడదీయడం వల్ల ఇంటిని కాస్త చల్లగా ఉంచుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మసాలాలకు దూరంగా ఉండాలి.
ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.
తినే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి.
ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు చేయించాలి. ఎండ తీవ్రత పెరిగిన తర్వాత స్నానాలు చేయడం మంచిది కాదు.
చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు నీటితో కలిసిన మాయిశ్చరైజింగ్ రాసుకోవాలి.
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. సూర్య కిరణాల వల్ల చర్మంలోని కొల్లాజెన్ దెబ్బతింటుంది.
ఎండలోకి వెళ్లడం తప్పదనుకునేవారు ఎస్‌పీఎఫ్-15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ తగిలే భాగాల్లో రాసుకోవాలి. తలకు టోపీ ధరించండి.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోండి.
పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ, దానిమ్మ, నారింజ పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి ఎక్కువగా తీసుకోండి.
వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఎండ నుంచి ఇంటికి లేదా నీడకు వెళ్లిన వెంటనే ముఖం కడుగుకోరాదు. కొంచెం సేపు ఆగిన తర్వాతే కడుగుకోవాలి.
టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.
వేసవి కాలంలో బయటకు వెళ్ళేప్పుడు ఒక వాటర్ బాటిల్‌ను కూడా వెంట తీసుకెళ్లండి.
వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత పెరిగితే వడ దెబ్బ తగిలే అవకాశం ఉంది.
శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలను మించితే వడదెబ్బకు గురవ్వుతారు. దీనివల్ల వాంతులు, అలసట, నీరసం, తలనొప్పి, కండరాల తిమ్మిరులు, కళ్లు తిరగడం వంటివి ఏర్పడతాయి.
వడదెబ్బకు గురైన వెంటనే వైద్యం అందించాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.
శరీరం సూర్యరశ్మికి బహిర్గతమై అదుపు తప్పుతున్నట్లు అనిపిస్తే.. సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది.
బయట వాతావరణం పెరిగితే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.
పిల్లల మెదడులో శరీర ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల పిల్లలు త్వరగా వడదెబ్బకు గురవుతారు.
పిల్లల శరీరంలో ఉండే నీటి పరిమాణం చాలా తక్కువ. వేసవిలో ఆ నీరు వేగంగా ఆవిరైపోతుంది. దీనివల్ల వారు త్వరగా వడదెబ్బకు గురవుతారు.
ముఖ్యంగా ఆరేళ్ళ లోపు చిన్నారులను వేసవిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగితే వారిలో ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.

No comments:

Post a Comment