Breaking News

09/04/2019

కాంగ్రెస్ అధిష్టానం ధిక్కరించి... జగన్

విజయవాడ, ఏప్రిల్ 8, (way2newstv.in)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ అధినేతగా.. ఏపీ ప్రతిపక్ష నేతగా సుపరిచితమైన పేరు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. ప్రత్యక్ష రాజకీయల్లోకి అడుగు పెట్టారు ఈ యువనేత. తొలిసారి ఎంపీగా ఎన్నికై.. తండ్రి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి.. వైఎస్సార్ కాంగ్రెస్‌ స్థాపనతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. తొమ్మిదేళ్లగా పార్టీ అధికారంలో లేకపోయినా.. మొండి ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అనుక్షణం ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యల్ని తెలుసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో తృటిలో అధికారం చేజారినా.. పాదయాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల్నే పార్టీ మేనిఫెస్టోగా మార్చేశారు. గెలుపే లక్ష్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. జగన్ 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కడప ఎంపీగా పోటీ చేసి లక్షా 78వేల ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా.. రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2009 సెప్టెంబర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. 


కాంగ్రెస్ అధిష్టానం ధిక్కరించి... జగన్

జగన్ ముఖ్యమంత్రి పదవి ఆశించినా.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆసక్తి చూపలేదు. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. తర్వాత పరిణామాలు మారడంతో.. కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు. కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి.. తల్లి విజయమ్మ విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. జగన్ 2011లో 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' (YSRCP)ని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు.కొద్ది రోజులకే కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. విలువలకు ప్రాధాన్యమిస్తానంటూ.. వారితో పదవులకు రాజీనామా చేయించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి 5లక్షల 43 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ జగన్ బాబాయి వైఎస్ వివేకాను బరిలోకి దింపింది. కానీ విజయమ్మ 85వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. తర్వాత 2012లో ఆస్తుల కేసుల్లో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయగా.. 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్ లేకపోయినా విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతల్ని చక్కదిద్దారు. ఇక జగన్ సోదరి షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జగన్ విడుదలయ్యారు. 2014లో తృటిలో చేజారిన అధికారం 2014 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ముందుకు సాగారు జగన్. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ వైపు మొగ్గు చూపినా జగన్ మాత్రం.. ప్యాకేజీ వద్దంటూ హోదా పోరును కొనసాగించారు. రాష్ట్రానికి హోదా ప్రకటించాలంటూ.. నిరాహార దీక్షకు దిగారు. నిరసన కార్యక్రమాలు.. ఢిల్లీలో ధర్నాలతో హోరెత్తించారు. ఇడుపులపాయ టు ఇచ్చాపురం.. 'ప్రజా సంకల్ప యాత్ర' జగన్ 2017లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ప్రారంభించారు. నవ రత్నాలు ప్రకటించి.. ఇడుపుల పాయలో యాత్రను ప్రారంభించి .. ఇచ్చాపురం వరకు.. దాదాపు 3వేల కిలోమీటర్లకుపైగా కొనసాగించారు. పాదయాత్ర సమయంలోనే హోదాను కోరుతూ వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. తర్వాత పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం హోదా ప్రకటించడం కుదరదని తేల్చడంతో.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. పాదయాత్ర చేస్తూనే జగన్ కూడా హోదా పోరాటంలో భాగస్వామ్యులయ్యారు. పాదయాత్ర ముగిసిన వెంటనే జగన్ సమర శంఖారావం, అన్న పిలుపు పేరుతో పార్టీ బూత్ లెవల్ కార్యకర్తలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తటస్థులతో సమావేశమయ్యారు. ఈలోపే ఎన్నికలు రావడంతో 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించి సంచలనం రేపారు. పాదయాత్రకు ముందు ప్రకటించిన నవరత్నాలు.. యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యల్ని మేనిపెస్టోలో చేర్చారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు గెలుపును అందించడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. 2014లో చేజారిన అధికారాన్ని దక్కించేకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జగన్ ఎంత వరకు సఫలీకృతమవుతారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. 

No comments:

Post a Comment