Breaking News

25/03/2019

ప్లస్ వన్ క్లాసులు నిర్వహిస్తే చర్యలే

న్యూఢిల్లీ, మార్చి 25, (way2newstv.in)
పదోతరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించకముందే క్లాస్-11 తరగతులు నిర్వహించే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని సీబీఎస్‌ఈ హెచ్చరించింది. పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో కూడా మార్పులకు శ్రీకారం చుట్టింది. సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఈ ఏడాది రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేయడానికి సీబీఎస్‌ఈ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం అయ్యేలోపే ఫలితాలు విడుదల చేసి, రీవాల్యూయేషన్ ప్రక్రియను కూడా పూర్తిచేయాలని గతేడాది ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ ఈ మేరకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసింది. సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాలు వచ్చేవరకు క్లాస్-11 తరగతులు నిర్వహించడానికి వీల్లేదని పాఠశాలలకు ఆదేశాలు జారీ అయినట్లు సీబీఎస్‌ఈ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై సీబీఎస్‌ఈ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెల్లడికాలేదు. మూల్యాంకన ప్రక్రియను కూడా సీబీఎస్ఈ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. 


ప్లస్ వన్ క్లాసులు నిర్వహిస్తే చర్యలే

ఉదయం 8 గంటల కల్లా మూల్యాంకనానికి వచ్చే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని.. 20 రోజుల్లో మూల్యాంకన ప్రక్రియను ముగించాలనే ఉద్దేశంతో కఠినమైన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఉపాధ్యాయులు, పాఠశాలల అధికారులు ధ్రువీకరించారు. మూల్యాకనం కోసం టీచర్లకు అనుమతినిచ్చే బాధ్యతను సంబంధింత పాఠశాలకే సీబీఎస్‌ఈ అప్పగించింది. ఉపాధ్యాయులకు అనుమతినివ్వని పాఠశాలలపై రూ.50,000 జరిమానా విధించనుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే పాఠశాలల గుర్తింపును సైతం రద్దుచేయడానికి కూడా సీబీఎస్‌ఈ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి నెలఖరులో క్లాస్-10 పరీక్షలు, ఏప్రిల్ మొదటి వారంలో క్లాస్-12 పరీక్షలు ముగియనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మే మూడోవారం లేదా చివరివారంలో క్లాస్-12 ఫలితాలు, జూన్ 1న క్లాస్-10 ఫలితాలను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలిసింది. ఫలితాల వెల్లడి తేదీలను సీబీఎస్‌ఈ ధ్రువీకరించాల్సి ఉంది. మూల్యాంకనం, ఇతర తాజా అప్‌డేట్స్ కోసం 'శిక్షా వాణి' యాప్‌ను సీబీఎస్‌ఈ రూపొందించింది.మూల్యంకనపనులకు సంబంధించి, దేశంలోని అనేక కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బోర్డు మూడంచెల తనిఖీ విధానాన్ని రూపొందించింది. జవాబు పత్రాలను ఉపాధ్యాయుల రెండుసార్లు మూల్యాంకనం చేస్తారు. అనంతరం తుది మార్కులను ఇస్తారు. పరీక్షల ప్రారంభానికి ముందు జరిగిన సమావేశంలోనే మూల్యాంకనం విషయంలో తప్పులు జరిగితే కఠినంగా వ్యవరిస్తామని సీబీఎస్‌ఈ బోర్డు పాఠశాలలను హెచ్చరించింది. గతేడాది మూల్యాంకనంలో పొరపాట్లు చేసిన ఉపాధ్యాయిులను సీబీఎస్‌ఈ సస్పెండ్ కూడా చేసింది. 

No comments:

Post a Comment