Breaking News

03/07/2018

పేరుకే ఫీజుల నియంత్రణ

అదిలాబాద్, జూలై 3, (way2newstv.in)
కూలీ పనిచేసుకునే వారి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ల వరకు తమ పిల్లల్ని మంచి స్కూల్లో, ఉన్నతమైన విద్యను ఆశిస్తున్నారు.. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల లేమి, ప్రభుత్వ పాఠశాలలో విద్యావిధానంపై సమాజంలో చిన్నచూపు ప్రైవేట్ విద్యాసంస్ధలకు వరంగా మారాయి... పట్టణ ప్రాంతాల్లోను కాన్వెంట్ స్కూల్లలో ఫీజులు వేలరూపాయలు వసూలు చేస్తున్నారు.. విద్యాహక్కుచట్టం, ఫీజుల నియంత్రణ చట్టాలు ఎన్ని వచ్చినా అమల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి.మంచిర్యాల జిల్లాలో అనుమతి లేని పాఠశాలలే అధికంగా ఉన్నాయి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రైవేట్ స్కూళ్లు అధికారుల అండదండలతో నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి..  టెక్నో, డిజి, ప్లే,స్పేస్, ఒలంపియాడ్, ఐఐటీ, కాన్సెప్ట్ అనే పేరుతో ఉన్న స్కూల్లు పుట్ట‌గొడుగుల్లా వెలిసాయి..  ప్రైవేట్ స్కూల్స్ నిబంధనల్ని పెడచెవిన పెడుతున్నాయి.. వాస్తవంగా స్కూల్ పేరు తర్వాత టెక్నో, కాన్సెప్ట్, ఐఐటీ లాంటి పేర్లు ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్కూల్లకు అనుమతులుండాలి.. కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే ప్రైవేట్ స్కూల్లలో ఆటస్థలం, కనీస సౌకర్యాలలో  టాయిలెట్లు సరిపడా ఉండటం, క్లాస్ రూముల్లో గాలి వెలుతురు సక్రమంగా రావడం, అగ్నిమాపక నిరోధక పరికరాలు ఇలా ఎన్నో నిబంధనలు ఉంటే కానీ కేంద్రం నుంచి టెక్నో, ఒలింపియాడ్ స్కూల్స్్కు పర్మిషన్లు రావు.. 




పేరుకే ఫీజుల నియంత్రణ

అయితే మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్్నగ్, ఆసిఫాబాద్, లక్షెట్టిపేట, చెన్నూర్ తదితర ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లుగా కనీసం రాష్ట్రప్రభుత్వం నుంచి కూడా అనుమతులు తీసుకోకుండా ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తున్నాయి.. ఒక్క మంచిర్యాల పరిసర ప్రాంతంలో దాదాపు 100కి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉంటే వాటిలో కనీసం సగానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు..  అనుమతులు లేని పాఠశాలలు జిల్లాలో దాదాపు 200కి పైగానే ఉంటాయి.రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు నడిస్తే నిబంధ‌న‌ల ప్ర‌కారం లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు... జరిమానాతో పాటు పరిస్థితి తీవ్రతను పట్టి క్రిమినల్ కేసు నమోదుచేసి యజమానిని జైలుకు పంపే అధికారాలు విద్యాశాఖకు ఉన్నాయి.. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాసంవత్సరం మొత్తం  అయిపోయేవరకు విద్యార్థులకు అక్కడే పాఠాలు బోధించి పరీక్షల్ని మాత్రం  గుర్తింపు ఉన్న స్కూల్ల ద్వార పరీక్షలు రాపిస్తున్నాయి.. మరోవైపు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు.. మోడల్ స్కూల్, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందాలంటే గుర్తింపు ఉన్న స్కూల్లలో రెండు నుంచి ఐదో తరగతి వరకు చదవినట్లు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.. ప్రస్తుతం చాలా మందికి ఇది లేక ప్రవేశాలు పొందలేని పరిస్థితి.. మరోవైపు అనుమతిల్లేని పాఠశాలలో ఫీజులు కూడా 50వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం  ఫీజులకు సంబంధించి పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులు అందరిక అందుబాటులో ఉండాలని అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం 2009లోనే జీవో విడుదల చేసింది.. కానీ ప్రభుత్వ నిబందనల్ని అమలు చేసే యంత్రాంగం పటిష్టంగా లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ యధేచ్చగా కొనసాగుతోంది.. డిస్ట్రిక్ ఫీ రెగ్యులేటరి కమిటీ నిర్ణయించిన ఫీజులుండాలి కానీ అలాంటి కమిటీలు ఫాం అయిన దాఖలాలు కూడా లేవు..అనుమ‌తిలేకుండానే న‌ర్స‌రీ, కేజీ చ‌దివే పిల్ల‌ల్ని హాస్ట‌ల్లో చేర్చుకోవ‌డం జ‌రుగుతోంది.. కొద్ది నెల‌ల కింద‌ట చెన్నూర్ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన నాయ‌కులు ఎలాంటి అనుమ‌తులు లేకుండా న‌డిపిస్తున్న హాస్ట‌ల్లో అనారోగ్యంతో వ‌రుస‌గా ముగ్గురు చిన్నారులు చనిపోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దంప‌డుతోంది.. పాఠ‌శాలల్లో టెక్స్ట్ బుక్స్, నోట్స్ అమ్మ‌రాదు.. కానీ ధ‌నార్జ‌నే ద్యేయంగా  ప్రైవేట్ స్కూల్ యాజ‌మాన్యాలు ఏకంగా బుక్ డిపోలు ఏర్పాటు చేసి అమ్ముతున్నప్ప‌టికీ విద్యాశాఖ అధికారులు కిమ్మ‌న‌డం లేదు.. కొద్ది రోజుల కింద‌ట మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని చైత‌న్య టెక్నో స్కూళ్లో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేయ‌డంతో దాదాపు 2ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన పుస్త‌కాల్ని అధికారులు సీజ్ చేశారు.. టెక్నో స్కూల్స్, ఈ టెక్నో స్కూల్స్ లాంటి ఆకర్షణీయమైన పేర్లను తొలగించాలని ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో డీఈఓ ఆదేశాలిచ్చారు.. కానీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆదేశాలను పట్టించుకునే పరిస్థితి లేదు.. ఇకనైనా ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లలో జరుగుతున్న దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

No comments:

Post a Comment