Breaking News

23/07/2018

వైజాగ్ సిట్..కధ కంచికి

విశాఖపట్టణం, జూలై 23 (way2newstv.in) 
వేల కోట్ల రూపాయల విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఇక   పూర్తిగా రహస్యమేనా? ప్రభుత్వానికి  ఈ నివేదికను బహిర్గతం చేసి దోషులను శిక్షించే ఉద్దే శమే లేదా? ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి చేరిన నివేదిక ఇంకా ఎందుకు బహిర్గతం కాలే దు? ప్రతిపక్షాల నుంచి తరచు వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే రావడం లేదు. ఒక పక్క జగన్, మరో పక్క పవన్ ఇంకో పక్క బీజేపీ, వామపక్షాలు సిట్ నివేదికపై ఎంతగా విమర్శలు గుప్పిస్తున్నా అధికార పార్టీ నేతలెవ్వరూ దీనిపై ఏమాత్రం నోరు మొదపడం లేదు. దీని గురించి ఎవ్వరూ ఎక్కడా ప్రస్తావించడమే లేదు. ఇదంతా చూస్తుంటే నివేదికను బయటపెట్టా లన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అనుమానం తలెత్తుతోంది. సిట్ నివేదికలో భూకబ్జాదారుల జాబితాలో అధికార పార్టీకి చెందిన నేతలు ఉండటం వల్లే ఇలా జరుగుతోందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిట్ నివేదికను బహిర్గతం చేస్తే తాము పార్టీని వీడి వె ళ్తామంటూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బెదిరించడం కూడా నివేదిక తొక్కిపెట్టడానికి కారణమన్న ప్రచారం జరుగుతుంది. 



వైజాగ్ సిట్..కధ కంచికి

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరిన సిట్ నివేదికను బహిర్గతం చేయడం, నివేదికలో సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకోవడం ఇక ఇప్పట్టో లేనట్లే అన్న వాదనాలు వినిపిస్తున్నాయి.  విశాఖ భూ కుంభకోణం మీద వచ్చిన ఫిర్యాదుల మీద బహిరంగ విచారణ జరుపుతామని రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా ప్రకటించారు. కానీ.. రాజకీయ ఒత్తిడి కారణంగా అది జరగలేదు. దానికి బదులు సిట్ విచారణ జరిగినా, ఫలితం లేదు. నివేదికను బయటపెట్టకపోవడం, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అదే తరహా అక్రమాలు మరిన్ని జరిగేందుకు ఆస్కారం కలుగుతోంది. ఏకంగా విశాఖ ఆర్డీవోనే జిల్లా కలెక్టర్ భూ కుంభకోణం కేసుల కారణంగా ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి వచ్చిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతుంది. మరికొందరు అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో పర్యటించిన పవన్ పదే పదే సిట్ నివేదికను ప్రస్తావించారు. వామపక్షాలైతే నివేదికను బహిర్గతం చేయాలంటూ ధర్నాలకు దిగాయి. సిట్ నివేదిక బయటకు వస్తే అధికార పార్టీ బండారం బయట పడుతుందని బీజేపీ పలు పర్యాయాలు ఎదురుదాడికి దిగింది. ఈ నివేదికను బహిర్గతం చేసి నిందితులను శిక్షించాలని జగన్ కూడా డిమాండు చేశారు. అయినా, ప్రభుత్వం మౌనమే వహిస్తోంది. దీంతో దీనివెనుక మర్మమేంటో ఎవరికీ అర్థం కాకుండా పోతోంది.విశాఖ నగరంలో జరిగిన వేలకోట్ల రూపాయల విలువచేసే వందల ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ జరిపిన సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజాల్ నేతృత్వంలోని బృందం... ఈ ఏడాది జనవరిలో నగర పోలీసు కమిషనర్ టి.యోగానంద్‌కు నివేదిక సమర్పించింది. 20 రోజుల పాటు దాన్ని పరిశీలించిన తర్వాత ఆయన ఆ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. అక్కడి నుంచి అది ముఖ్యమంత్రి పేషీకి చేరింది. గత మార్చి  అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదికను బహిర్గతం చేయాలని వివిధ పార్టీలు డిమాండు చేశాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదిక ఆధారంగా చర్చకు పలువురు సిద్ధమయ్యారు. అయితే, ప్రభుత్వం మాత్రం నోరు మెదపలేదు. నిదేదిక గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఈలోగా రూ. 300 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను మార్చిలో అప్పటి  విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు ప్రైవేటువారికి కట్టబెట్టారన్న ఆరోపణలొచ్చాయి. సిట్ విచారణ కొనసాగినంత కాలం ఈ భూముల విషయంలో వేలు పెట్టకపోయినా.. నివేదిక బయట పడకపోవడంతో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ, ఇనాం భూములను ప్రైవేటు పరం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిట్ విచారణ పూర్తయినా నివేదిక బయటకు పొక్కకపోవడం, ఆ నివేదిక ఆధారంగా చర్యలేమీ లేకపోవడం ఇప్పుడు కబ్జాదారులు, అక్రమార్కులకు వరంగంగా మారింది. ఆరునెలల పాటు వేలసంఖ్యలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సిట్ ..  డిసెంబర్ చివరివారంలో  నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో చివరకు సిట్‌కు మార్గదర్శిగా వ్యవహరించిన విశాఖ సీపీ యోగానంద్‌కు అందజేశారు. గత ఏడాది జూన్ 28న రంగంలోకి దిగిన సిట్  బృందాలు రెండుసార్లు గడువును పెంచిన తర్వాత ఆరునెలల పాటు పనిచేశాయి. విశాఖలో సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల విలువైన ముదపాక, కొమ్మాది, పరదేశిపాలెం భూములతో పాటు మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములపై ప్రభుత్వం ఈ సిట్‌ను నియమించింది. ఫిర్యాదులు వేల సంఖ్యలో రావడంతో పరిధిని పెంచింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజాల్ నేతృత్వంలోని సిట్  ప్రాథమిక నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులతో భీమిలి మాజీ తహసీల్దార్ బీటీవీ రామారావు, ఉప తహసీల్దార్ రాజా శ్రీధర్, విశాఖ రూరల్ తహసీల్దార్ మజ్జి శంకరరావు, సర్వే విభాగం ఇన్‌స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు తదితరులపై క్రిమినల్  కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. విశాఖ రూరల్ మండలంలోనే 600 ఎకరాల భూమి రికార్డులు ట్యాంపరింగ్‌కు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపారు. ట్యాంపరింగ్ భూముల్లో ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారని కూడా అంటున్నారు. మొత్తం 2,873 ఫిర్యాదులు రాగా వాటిలోని 337 కేసులపై సిట్ దర్యాప్తు జరిపింది. కుంభకోణంలో పెద్ద తలకాయలే ఉండటంతో ప్రతి ఒక్క కేసు వివరాలను నివేదికలో సమగ్రంగా పొందుపరిచారు. ఈ నివేదికపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలి. 

No comments:

Post a Comment