Breaking News

23/07/2018

వాటర్ ట్రాన్స్ పోర్టు దిశగా ఏపీ అడుగులు

విజయవాడ, జూలై 23, (way2newstv.in)
టూరిజం సర్క్యూట్‌  ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొదటి దశలో నగరంలోని కనకదుర్గ ఆలయం, రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, రాజీవ్‌గాంథీ పార్కు, పూల మార్కెట్‌, కాళేశ్వరరావు మార్కెట్‌, మూడు కాలువలు, బరంపార్కు తదితర ప్రాంతాలను కలుపుతూ త్రికోణాకృతిలో ఈ సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ టూరిజం సర్క్యూట్‌కు అందమైన ఆకృతులను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఈ ప్రాంతాల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌ పై పచ్చదనం పెంచుతారు. పుష్కరాలకు నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఘాట్లను, నదిలో స్నానానికి ఏర్పాటు చేసిన కాలవను అందంగా తీర్చిదిద్ది నిర్వహణను మెరుగుపరచనున్నారు. లైటింగ్‌ మధ్య కాలవల్లో యాత్రికుల విహారానికి బోటింగ్‌ ఏర్పాటు చేస్తారు. నూతనంగా వాటర్‌ టాక్సీలను ప్రవేశపెట్టనున్నారు. పార్కులను పూలమొక్కలతో అందంగా తీర్చి దిద్దుతారు. విజ్ఞాన, వినోద కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా ఎగ్జిబిషన్‌ హాలు నిర్మిస్తారు. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, కనకదుర్గ ఆలయం తదితర ప్రాంతాల్లో రోజువారీ రెండు లక్షల మంది వరకు ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. వీరందరిని ఆకర్షించడంతో పాటు వ్యాపార అవసరమైన నిత్యావసరాలు, ఇతర వినిమయ వస్తువులు అందుబాటులో ఉంచుతారు. దీనిలో భాగంగా రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, కనకదుర్గ ఆలయం సమీపంలో బిగ్‌ మాల్స్‌, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. టూరిజం సర్క్యూట్‌లో వాహనాలపైనా నియంత్రణ ఉంటుంది. కాలుష్యం లేని వాహనాలనే ఈ సర్క్యూట్‌లో అనుమతిస్తారు. పాండ్‌ టాక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మొదటి దశలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తయ్యాక, రెండో దశలో కనకదుర్గ ఆలయం వద్ద ఘాట్ల నుంచి సంగమం వరకు నదీ తీర ప్రాంతం (రివర్‌ ఫ్రంట్‌)ను అభివృద్ధి చేయనున్నారు. రాజధాని నిర్మాణం తరహాలో భూములు సమీకరించాలని నిర్ణయించారు. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, నగర కార్పొరేషన్‌, జిల్లా యంత్రాంగం ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఆకృతులు పూర్తయిన క్రమంలో ప్రాజెక్టు వ్యయం అంచనాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే జిల్లా యంత్రాంగం అందించేందుకు ఏర్పాటు చేస్తోంది. 



 వాటర్ ట్రాన్స్ పోర్టు దిశగా ఏపీ అడుగులు

No comments:

Post a Comment