Breaking News

02/01/2020

రిజిస్టర్డ్ పార్టీలకు 10 గుర్తులు

హైద్రాబాద్, జనవరి 2   (way2newstv.in)
రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ ఒకే కామన్ సింబల్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. పార్టీ గుర్తులు కలిగి ఉన్న ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలకు వారి వారి పార్టీ గుర్తులే ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేర్లను రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ విధంగా రిజిస్టర్ అయిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు గతంలో వేర్వేరు గుర్తులు లభించేవి. దాంతో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వచ్చేవి. 
రిజిస్టర్డ్ పార్టీలకు  10 గుర్తులు

దాంతో గుర్తులు లేకుండా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ కామన్‌గా ఒకే గుర్తు లభించేందుకు వీలవుతుంది. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, గ్రామ పంచాయితీలు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీల ఎన్నికల్లో ఒకే గుర్తు ఇస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పేరుతో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2020 జనవరి 4 లోగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు తమకు ఇష్టమైన గుర్తులతో కూడిన లేఖను కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇప్పటికే కొన్ని గుర్తులను కమిషన్ ఎంపిక చేసి ఒక జాబితాను ప్రకటించింది. ఈ జాబితా నుండి పది గుర్తులను రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎంపిక చేసి కమిషన్‌కు సమర్పించాలని కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా ఎంపిక చేసే 10 గుర్తుల్లో మొదటి నుండి ఏదో ఒక గుర్తును కేటాయిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment