Breaking News

24/12/2019

టీడీపీలో నెంబర్ 2గా అచ్చెన్న

శ్రీకాకుళం, డిసెంబర్ 24(way2newstv.in)
చంద్రబాబుకు ఇపుడు అచ్చెన్నాయుడు బాగా కలసివస్తున్నారు. అచ్చం బాబు ఎలా మాట్లాడుతారో అలాగే ఆయన కూడా ఎదుటి పక్షంపై నిందారోపణలు చేయడం ద్వారా జల్లాల్సిన బురద జల్లేస్తారు ఇక ఆ తరువాత దాన్ని తుడుచుకోవడం అధికార వైసీపీకి అతి పెద్ద పనిగా ఉంటోంది. అచ్చెన్నాయుడు మనిషి భారీగా ఉంటారు. ఇక ఆయన నోరు కూడా పెద్దది. దాంతో మైకు అందుకుంటే ఆయన మాటలు తూటాల్లా పేల్చేస్తున్నారు. దాంతో ధీటుగా ఎదుర్కోవడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా జగన్ కి అచ్చెన్నాయుడు నాడూ నేడూ తలనొప్పిగా మారారని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ని అనరాని మాటలు అని మంత్రిగా విరుచుకుపడిన అచ్చెన్నాయుడు ఇపుడు విపక్ష నేతగా కూడా అదే జోరు చూపిస్తున్నారు.అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటేనేమి అవతల ఒక్క అచ్చెన్నాయుడు చాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. 
టీడీపీలో నెంబర్ 2గా అచ్చెన్న

బాబు సైతం అచ్చెన్నాయుడుని పూర్తిగా వాడేసుకుంటున్నారు. బీసీ నేతగా ఉండడం, కింజరపు ఫ్యామిలీ ట్యాగ్ ఇలా బాబుకు అన్ని విధాలుగా రాజకీయం చేయడానికి అచ్చెన్నాయుడుకు ఫుల్ రైట్స్ ఇచ్చేశారు. ప్రతీ ప్రశ్న అచ్చెన్నే వేస్తున్నారు. మైకు అందుకుంటే ఆయన ఏం మాట్లాడుతారోనని వైసీపీ మంత్రులు హడలిపోవాల్సివస్తోంది. పక్క జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వారు కూడా భారీ కాయం ఉంటే సరిపోదంటూ అచ్చెన్నాయుడు మీద విసుక్కుంటున్నారంటే ఆయన ప్రభుత్వానికి టెంపరేచర్ ఎలా పెంచేస్తున్నారో అర్ధమవుతోంది కదా.నిజానికి జగన్ టార్గెట్ ఎపుడు చంద్రబాబు మీదనే ఉంటుంది. బాబునే ఆయన గురి పెట్టి మరీ బాణాలు విసురుతారు. అటువంటిది జగన్ ద్రుష్టిలో ఇపుడు అచ్చెన్నాయుడు బిగ్ ఫిగర్ అయిపోయారు. మాటిమాటికీ అచ్చెన్న లేచి నిలబడి నిలదీస్తున్న వైనంలో జగన్ లో సైతం సహనం నశిస్తోందని అంటున్నారు. మద్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వం లెక్కలు చెప్పిన కూడా వినకుండా అచ్చెన్నాయుడు ఇంకా వేయి వరకూ షాపులు తెరిచే ఉన్నాయంటూ తనదైన శైలిలో లెక్కలు చెప్పడంతో జగన్ గుస్సా అయ్యారు. అచ్చెన్నాయుడు అబద్దాలు ఆడుతున్నారని, ఆయనకు మైక్ ఇవ్వరాదని కూడా జగన్ అంటున్నారంటే ఈ సిక్కోలు పెద్దాయన నోటి జోరు ఎలా ఉందో అర్ధమవుతోందిగా.నిజానికి సభలో సభ్యుడెవరైనా తప్పు మాట్లాడితే వారి మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారు. ఇపుడు ఏకంగా ముఖ్యమంత్రి జగనే అచ్చెన్నాయుడు మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని అంటున్నారంటే పరిస్థితి ఏంటన్నది తెలుస్తూనే ఉంది. అచ్చెన్నాయుడు సభలో చెప్పాలనుకున్నది చెప్పేసి ఇరుకునపెడుతున్న తీరు వైసీపీకి ఇబ్బందిగానే ఉంది. ఆయన మొత్తం సభను ఆకర్షించేలా తన ఆహార్యమే కాకుండా నోటితోనే దాడి చేస్తూంటే వైసీపీ మంత్రులకు పాలుపోవడంలేదని అంటున్నారు. సీటు అటు నుంచి ఇటు మారినా కూడా అచ్చెన్నాయుడు ధాటిని తగ్గించలేకపోతున్నామని వైసీపీ సర్కార్ మధనపడుతోందంటే ఆయన ఎంత చికాకు పెడుతున్నారో మరి. మొత్తానికి బాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒకే ఒక్కడుగా అచ్చెన్నాయుడు కాచుకుంటున్న తీరు ఎంతో ఊరటను ఇస్తోంది మరి.

No comments:

Post a Comment