Breaking News

31/07/2019

తెలంగాణలో సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అసంతృప్తి

హైద్రాబాద్, జూలై 31, (way2newstv.in -Swamy Naidu)
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ ఆఫీసర్లలో అసంతృప్తి రగులుతోంది. ప్రాధాన్యత లేని పోస్టుల్లో తమను నియమిస్తున్నారన్నది వారి అసంతృప్తికి కారణం. గత మూడేళ్ల నుండి ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఎలాంటి ప్రాధాన్యం లేని, పనిలేని పోస్టులో తనను నియమించారని ఎస్సీ వర్గానికి చెందిన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్-జనరల్ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)కు దరఖాస్తు చేశారు. 2019 ఆగస్టు 31 వరకు ప్రస్తుతం ఉన్న పదవిలో కొనసాగుతానని, అదే రోజు నుండి తనను పదవీ బాధ్యతల నుండి తప్పిస్తూ వీఆర్‌ఎస్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాశారు. మురళి దారిలోనే మరికొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ సివిల్స్ అధికారులు వెళ్తారని తెలుస్తోంది. మురళితో పాటు మరో 20 మంది అధికారులు ఏడాది క్రితమే హైదరాబాద్‌లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ‘బడుగు’ వర్గాలకు చెందిన ఉన్నతాధికారులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అంశంపై చర్చించారు. 2018 జూన్‌లో ఈ మీటింగ్ జరిగింది.


తెలంగాణలో సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అసంతృప్తి 
తెలంగాణలో సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అసంతృప్తి

ఎస్సీ, ఎస్టీ, బీసిలకు చెందిన సివిల్స్ అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమిస్తుండటం పట్ల ప్రభుత్వానికి తమ అసంతృప్తి తెలియచేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏడాది క్రితమే కలిసి ఆవేదన తెలిపిన తర్వాత మార్పు వస్తుందేమోనని ఎదురు చూశారు. కాని ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి కే. ప్రదీప్ చంద్ర రిటైర్ అయ్యారు. రిటైర్‌మెంట్‌కు ముందే తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం లభిస్తుందని ఆశించారు. కానీ ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుతెచ్చుకున్న ప్రదీప్ చంద్ర రిటైర్‌మెంట్ తర్వాత తన సేవలను ప్రభుత్వం ఇతరత్రా ఉపయోగించుకుంటుందని భావించారు. అలాంటి అవకాశం కూడా ఆయనకు రాలేదు. ఈ పరిస్థితిలో ఐఏఎస్ అధికారులు శర్మన్, బాల మాయాదేవి, చంపాలాల్, కిషన్, భరత్ నాయక్, లక్ష్మి తదితర బడుగు వర్గాలకు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారులు అసంతృప్తిగా పనిచేస్తున్నారు. సీనియర్ అధికారులతో పాటు జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.ఎస్సీ, ఎస్టీకి చెందిన ఐఏఎస్ అధికారులే కాకుండా ఐపీఎస్ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి తెనే్నటి కృష్ణప్రసాద్ మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. అనురాగ్ శర్మ డీజీపీ పోస్టునుండి రిటైర్‌మెంట్ తర్వాత ఈ పోస్టులో కృష్ణప్రసాద్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎస్సీ, ఎస్టీ సివిల్స్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరగడంతో ఎస్సీ వర్గానికి చెందిన కృష్ణప్రసాద్‌ను డీజీపీగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కృష్ణప్రసాద్‌కు డీజీపీ హోదా ఇచ్చినప్పటికీ, ఆయనను రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. కృష్ణప్రసాద్‌ను అంతకు ముందు కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోనే కొనసాగించారు. ఐఏఎస్ అధికారి మురళిని ఎలాంటి పనిలేని పోస్టులో ఎలా నియమించారో, కృష్ణప్రసాద్‌ను కూడా ఎలాంటి పనిలేని పోస్టులోనే నియమించారన్న అసంతృప్తి బడుగు వర్గాల్లో రగులుతోంది.

No comments:

Post a Comment