Breaking News

22/03/2019

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, మార్చ్ 22 (way2newstv.in
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ తెలుగు సంవత్సారాది శ్రీ వికారినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం నిర్వహించనుండడంతో ఏప్రిల్ 2న మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 


శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఇందులో భాగంగా  ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు.  తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది  పాల్గొంటారు.

No comments:

Post a Comment