Breaking News

01/01/2020

దిగొచ్చిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

ముంబై, జనవరి 1 ( way2newstv.in)
పసిడి ధర మళ్లీ తగ్గింది. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా దిగొచ్చింది. రెండు వారాలకు పైగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు తగ్గుతూ రావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగిరావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా కనిపించింది. దీంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.50 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.37,220కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గుదలతో రూ.40,660కు క్షీణించింది.బంగారం ధర గత రెండు వారాలుగా పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.1,300కు పైగానే పెరిగింది. డిసెంబర్ 11న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.35,910 వద్ద ఉంది.  
దిగొచ్చిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,170 వద్ద ఉంది. అయితే ఇప్పుడు రెండు రోజులుగా పసిడి ధర తగ్గుతూ వస్తోంది.బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,350కు పెరిగింది. ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర నిన్న తగ్గి, మళ్లీ ఈ రోజు పైకి కదలడం గమనార్హం.అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ మార్కెట్‌లో గత రెండు వారాల పసిడి పరుగు కారణంగా ధరలు పైకి చేరడంతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి ధర కొంత మేర తగ్గిందన్నారు.ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర నిలకడగా కొనసాగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.38,050 వద్దనే ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే రూ.39,250 వద్దనే కొనసాగుతోంది. కానీ కేజీ వెండి ధర కూడా రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,350కు చేరింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1,519.95 డాలర్లకు చేరింది. ఇది రెండు వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.57 శాతం క్షీణతతో 17.89 డాలర్లకు తగ్గింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 22 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment