Breaking News

28/12/2019

14 రోజులుగా బంగారం ధరలు

ముంబై, డిసెంబర్ 28 (way2newstv.in)
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం కూడా బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈసారి రూ.130 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.37,100కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.120 పెరుగుదలతో రూ.40,450కు ఎగసింది.బంగారం ధర 2 వారాలుగా పెరుగుతూనే వస్తోందని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు దాదాపు రూ.1,300 మేర పెరిగింది. డిసెంబర్ 11న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.35,910 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,170 వద్ద ఉంది. పండుగ సీజన్ ముంగిట, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర పెరగడం నిజం ప్రతికూల అంశమని చెప్పొచ్చు.అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 
14 రోజులుగా బంగారం ధరలు

దీంతో పసిడి ధర క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు. అంతేకాకుండా అమెరికా ఆర్థిక గణాంకాల నేపథ్యంలో మాంద్యం భయాలు మళ్లీ మొదలుకావడం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో అవి ఎప్పుడైనా పడిపోవచ్చనే ఆందోళనలు కూడా పసిడి పరుగుకు దోహపడుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.37,900కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరుగుదలతో రూ.39,100కు ఎగసింది. కేజీ వెండి ధర కూడా పరుగులు పెట్టింది. రూ.49,100కు చేరింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా పెరిగింది. ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 1,515 డాలర్ల పైకి చేరింది. ఇది 7 వారాల గరిష్ట స్థాయి. అదేసమయంలో వెండి ధర మాత్రం ఔన్స్‌‌కు 0.89 శాతం క్షీణతతో 17.83 డాలర్లకు తగ్గింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment