Breaking News

01/10/2019

ద్రోణంరాజు వర్సెస్ అవంతి

విశాఖపట్టణం, అక్టోబరు  1 (way2newstv.in)
విశాఖపట్నం వైఎస్ఆర్సీపీలో విబేధాలు బయటపడ్డాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మధ్య కాసేపు సంవాదం నడిచింది. దీంతో అక్కడి వాతావరణం అనూహ్యంగా వేడెక్కింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఒకరినొకరు మాటామాటా అనుకోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు అవాక్కయ్యారు. ఇదెక్కడి తలనొప్పి రా బాబు అని అధికారులు సైలెంటయ్యారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 
ద్రోణంరాజు వర్సెస్ అవంతి

ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, అధికారులు, వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రసంగిస్తుండగా.. అదే సమయంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ కలెక్టర్‌తో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి.. ‘‘అన్నా శీనన్నా... విశాఖ నగరంలోని పెదముషిడివాడలో ఉన్న మీకు గ్రామీణ కష్టాలు తెలియవు. కొద్దిగా వినండన్నా..’’ అని ద్రోణంరాజు శ్రీనివాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.మంత్రి వ్యాఖ్యల పట్ల ద్రోణంరాజు శ్రీనివాస్‌ కూడా ఘాటుగా బదులిచ్చారు. ‘‘ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎక్కడ నుంచో వలసొచ్చి.. ఇక్కడ కాలేజీలు పెట్టుకుని కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. సంతోషం.. ఆయనంటే చాలా గౌరవం ఉంది. నేను పెరిగింది పట్టణమైనా పుట్టింది గ్రామీణ ప్రాంతంలోనే. నాకు గ్రామీణం, పట్టణ ప్రాంతాలు రెండింటిపై అవగాహన ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన నాకు సీఎం వీఎంఆర్‌డీఎ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఈ పదవిని ఎవరైనా తీసుకున్నా అభ్యంతరం లేదు. చిన్నా, పెద్దా చూసి మాట్లాడాల’ని ద్రోణంరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దీనికి మంత్రి బదులిస్తూ.. శీనన్నా అపార్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించానంతే.. అవన్నీ మీకు తెలియవని కాదంటూ’ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు బయటకు రావడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.

No comments:

Post a Comment