Breaking News

16/09/2019

అదివాసుల పోరుబాటపై సోయం మౌనం...

అదిలాబాద్, సెప్టెంబర్ 16, (way2newstv.in)
మొన్నటి వరకు ఆదివాసులను ముందుండి నడిపించిన నాయకుడు ప్రజా ప్రతినిధిగా గెలిచాక తన అస్తిత్వాన్నే కొల్పోయడానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివాసులను పోరాటబాట పట్టించిన ఆయన ఇప్పుడు వారి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలిచారో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలకు స్పందించని స్థితిలోకి వెళ్లియారు. ఆదివాసుల ఉద్యమ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తున్నా.. కనీసం మాట్లాడకపోవడంపై ఆయన అనుచరుల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయనే ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు. లంబాడీలు ఎస్టీ జాబితాలోనే కొనసాగుతారు. దీనిలో ఎలాంటి అనుమానం వద్దు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది.
అదివాసుల పోరుబాటపై సోయం మౌనం...

ఆదివాసీ ఉద్యమం పట్ల ఒక్క మాట మాట్లాడినా అంతెత్తున ఎగిరిపడే సోయం బాపురావు ఇప్పుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల పట్ల మౌనంగా ఉండడంపై పలువురు నిస్మయం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసినప్పుడు జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ విషయంపై తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా సోయం బాపురావు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కనీసం ఆయన వ్యాఖ్యలను కూడా ఖండించలేదు. సోయం బాపురావు వైఖరి పట్ల ఇప్పటికే తుడుందెబ్బ నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర కమిటీలో విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుడుం దెబ్బలోని కీలక నాయకులు సోయం బాపురావుతో విభేదిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తుడుందెబ్బ ఆధ్వర్యంలో పలు మండలాల్లో లక్ష్మణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలో సైతం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై అక్కడే బైఠాయించి తుడుందెబ్బ నాయకులు నిరసన తెలిపిన సంగతి విధితమే.లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో ఆదివాసులు చేపట్టిన ఉద్యమంపై బిజెపి తన వైఖరిని ఇప్పటికి స్పష్టం చేయలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక సమయంలో కూడా బిజెపి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో సోయం బాపురావుకు టికెట్టు ఇవ్వడంతో ఆదివాసుల ఉద్యమం పట్ల బిజెపికి సానుభూతి ఉన్నట్టు అందరూ బావించారు. కానీ ఆ భావనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మాటలు చెరిపేశాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ ఆదివాసీ ఉద్యమం పట్ల బిజెపి ఇంకా తన వైఖరి స్పష్టం చేయకపోవడంపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తుడుందెబ్బను బిజెపి అనుబంద సంఘంగా మార్చేందుకు సోయం బాపురావు ప్రయత్నిస్తున్నారని పలువురు తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు ఇప్పటికే విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యల పట్ల సోయం బాపురావు స్పందించాల్సిన అవసరమొచ్చింది. పార్టీని ప్రశ్నించడమో.. లేదా తుడుందెబ్బను వీడి వెళ్లడమో ఏదో ఒకటి చేయాల్సిన సమయం ఆసన్నమైందని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఆదివాసుల గురించి ఆలోచించి తుడుందెబ్బను ముందుండి నడుపుతారా.. లేదా కేవలం స్వార్ధ ప్రయోజనాలు, పదవులు కోసం ఆశపడి ఆదివాసులకు, ఆదివాసుల ఉద్యమాన్ని నష్టాన్ని చేకూర్చే పార్టీలోనే ఉంటారా అనే విషయాన్ని సోయం బాపురావే తేల్చుకోవాలని చెబుతున్నారు. అయితే ఎంపి సోయం బాపురావు ఈ విషయంపట్ల ఎలాంటి వైఖరి అవలంభిస్తారో సమయమే సమాధానం చెబుతుంది.

No comments:

Post a Comment