Breaking News

18/07/2019

పార్టీ మార్పుపై రాయపాటి క్లారిటీ

గుంటూరు, జూలై 18(way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించిన కమలనాథులు పలు పార్టీల నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీనే టార్గెట్ చేసినట్టు అర్ధమవుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి డీలాపడ్డ టీడీపీకి బీజేపీ రూపంలో మరో కొత్త సమస్య ఎదురయ్యింది. ఇప్పటికే పలువురు బీజేపీలో చేరగా మరికొందరు కాషాయం కప్పుకోడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆయన నివాసానికి వెళ్లడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రాయపాటి స్పందించారు. తాను బీజేపీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో చేరాలని బీజేపీ నేతలు తనను ఆహ్వానించిన విషయం నిజమేనని అన్నారు. 
పార్టీ మార్పుపై రాయపాటి క్లారిటీ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ గుంటూరులోని మా ఇంటికి వస్తామంటే రమ్మని చెప్పానని అన్నారు. మా ఇంటికి వచ్చిన ఆయన పార్టీలోకి రావాలని తనను ఆహ్వానించారని తెలిపారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. వచ్చే వారం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆ పార్టీలో చేరాలో లేదో నిర్ణయం తీసుకుంటానని రాయపాటి తెలిపారు. అయితే, రాయపాటి కుమారుడు మాత్రం తాను టీడీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు మాట్లాడుతూ.. తాను పార్టీ వీడే ప్రసక్తేలేదని ఉద్ఘాటించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి మళ్లీ పోటీచేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలోనే కొనసాగుతారని భావించారు.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించడంతో.. ఆయన చూపు ఆ పార్టీవైపు మళ్లింది. అలాగే ఏపీలో పార్టీ ఓడిపోవడం, సాంబశివరావు కూడా కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఆయన బీజేపీలోకి వెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నారని గుంటూరు టాక్.

No comments:

Post a Comment