Breaking News

01/05/2019

రాజ్... వాగ్దాటి కి పడని ఓట్లు

ముంబై మే 1, (way2newstv.in
రాజ్ ఠాక్రే… మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత. ఆయన పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే శివసేన అంశగానే పుట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగానే పనిచేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి నేరుగా ప్రచారం చేయకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారంటే అది కాంగ్రెస్ కూటమికి అనుకూలంగానే భావిచారు. ఒకదశలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను తమ కూటమిలో కలుపుకోవాలనుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచనలతో ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పక్కన పెట్టిందంటున్నారు.నిజానికి రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీని పెట్టడం కూడా అనూహ్యంగానే జరిగింది. శివసేన అధినేత బాల్ ధాక్రే సోదరుడి కుమారుడైన రాజ్ ఠాక్రే పెదనాన్న వద్దే ఉన్నారు. ఆయన వద్ద రాజకీయ మెళుకువలు నేర్చుకున్నారు. 


రాజ్... వాగ్దాటి కి పడని ఓట్లు

ఒక రకంగా చెప్పాలంటే బాల్ థాక్రే బతికున్నప్పుడు ఆయనకు కుడిభుజం గా వ్యవహరిచింది రాజ్ ఠాక్రేయే. బాల్ థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రే శివసేన లో ఉన్నప్పటికీ అంత యాక్టివ్ గా లేరు. అయితే బాల్ థాక్రే మరణం తర్వాత శివసేన పగ్గాలు తనకు అందుతాయని రాజ్ ఠాక్రే భావించారు. పెదనాన్న రాజకీయ వారసత్వం తనకు లభిస్తుందనుకున్నారు. శివసేన పగ్గాలు ఉద్ధవ్ ధాక్రే చేపట్టడంతో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే సొంత పార్టీని పెట్టుకున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతో 2009లో ఎన్నికల బరిలోకి దిగి 13 అసెంబ్లీ సీట్లు సాధించారు. దీంతో రాజ్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతారని భావించారు. కానీ ఉద్ధవ్ థాక్రే క్రమంగా రాజకీయంగా పుంజుకోవడం, శివసేన ఇమేజ్ చెక్కు చెదరకపోవడంతో ఎంఎన్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. రాజ్ ఠాక్రే ప్రసంగాలు దంచడంలో దిట్ట గాని, వాటిని ఓట్ల రూపంలో మలచకోవడంలో ఫెయిలవుతున్నారన్నది వాస్తవం.2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఒక్క సీటుకే పరిమితమయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో రాజ్ ఠాక్రే పోటీకి దిగలేదు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజ్ థాక్రే పార్టీకి 11 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఒక్కసీటు కూడా దక్కలేదు. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం అయిదు శాతం మాత్రమే. 2014 లోక్ సభ ఎన్నికల్లో కనీస ఓట్లు కూడా రాలేదు. దీంతో రాజ్ ఠాక్రే ఈసారి రూటు మార్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకోవాలంటే ఈసారి లోక్ సభఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. అంతేకాదు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఠాక్రే ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రాజ్ ఠాక్రే క్షేత్రస్థాయిలో క్యాడర్ ను ఓటు బ్యాంకును గత దశాబ్దకాలంగా పెంచుకోకపోవడంపై ఆత్మశోధన చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు.

No comments:

Post a Comment