Breaking News

12/03/2019

టీడీపీ గూటికి జేడీ

విశాఖపట్టణం మార్చి 12, (way2newstv.in)
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఆయన ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, యువతతో భేటీ అయ్యారు. అయితే, ఆయన సొంతంగా పార్టీ పెడతారని కొన్ని రోజులు, జనసేనలో చేరుతారని, అలాగే లోక్‌సత్తాలో చేరి ఆ పార్టీ పగ్గాలు చేపడతారనే ప్రచారం సాగింది. ఒక దశలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ‌తో చర్చలు సాగించినా నిర్ణయం మాత్రం దాటవేశారు. తాజాగా ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు, టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేస్తారనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. తొలుత ఈ స్థానంలో మంత్రి లోకేశ్‌‌ను పోటీకి దింపాలని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి బరిలోకి నిలిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 


టీడీపీ గూటికి జేడీ

మంత్రి గంటాను విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే సమాలోచనలో బాబు ఉన్నట్టు భోగట్టా. దీంతో జేడీని టీడీపీలోకి తీసుకొచ్చి భీమిలి నుంచి పోటీకి నిలపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తుతో పాపులర్ అయ్యారు. అనంతరం మహారాష్ట్రకు బదిలీపై వెళ్లడంతో ప్రభుత్వ సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి పలు వర్గాలతో మమేకమయ్యారు. అయితే, సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించాలని భావించినా అది ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ చొరవచూపింది. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. లక్ష్మీనారాయణను హైదరాబాద్‌లో కలిసిన మంత్రి గంటా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

No comments:

Post a Comment