Breaking News

11/12/2019

పాలమూరు నుంచి ఆగని వలసలు

మహబూబ్ నగర్, డిసెంబర్ 11, (way2newstv.in)
అది వలసల జిల్లా. సరైన ఉపాధి లేక.. ప్రత్యామ్నాయ మార్గాలు కానరాక పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలు, వేర్వేరుచోట్ల తరలిపోక తప్పని ప్రాంతం. నాట్లు వేసే నెలరోజులు మినహాయిస్తే మిగతా పదకొండు నెలలు పనుల కోసం పాకులాడాల్సిందే. లేదంటే పిల్లాపాపలకు కడుపు నిండదు. ఇప్పటికే కొందరు దుబారు, సౌదీ, ఖతార్‌ దేశాలకు వెళ్లిపోతుంటే.. సరైన సమయంలో ఉపాధి హామీ పనులూ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లకు గత్యంతరం లేకుండా పోయింది. వెరసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు అధికమవుతున్నాయి. మరోవైపు కూలీ పనుల కోసం ఏపీలోని గుంటూరు, మంత్రాలయం ప్రాంతాలకు చెందిన వారు నెలరోజుల కోసం ఇక్కడ వలసవస్తున్నారు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఏటా 14లక్షలకు మందికి పైగా వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. 
పాలమూరు నుంచి ఆగని వలసలు

ప్రధానంగా నారాయణపేట జిల్లా కోస్గి, మక్తల్‌, ఉట్కూర్‌, సీసీకుంట మండలాలు, వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్‌, గోపాల్‌పేట, పెద్దమందడి, పామిరెడ్డిపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి, లింగాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైన అమ్రాబాద్‌, పదర, బల్మూరు నుంచి అధికంగా వలసలుంటాయి. గద్వాల జిల్లా గట్టు, అయిజ, మల్దకల్‌ నుంచి ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల పట్టణాలకు వెళ్తారు. దీంతో పంటలు చేతికొచ్చే సమయాల్లో విపరీతమైన కూలీల కొరత ఏర్పడుతోంది. వ్యవసాయ పనుల కోసం ఒక నెల ఈ జిల్లాలో ఉంటే మిగతా 11నెలలు బతకడం కష్టమని ఇక్కడ నుంచి అనేకమంది వలసబాట పడుతున్నారు. నారాయణపేట జిల్లా నుంచి సుమారు 4లక్షల మంది వలసపోయినట్టు సమాచారం. చాలామంది కుటుంబాలను వదిలి కొంత మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను అప్పజెప్పి వలసపోయారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11లక్షల జాబ్‌కార్డులున్నాయి. మే, జూన్‌, జూలైలో హరితహారం పనుల తర్వాత ఇప్పటివరకు ఉపాధి పనులు చేయించలేదు. ఇది కూడా వలసలకు ఓ కారణమని తెలుస్తోంది.నారాయణపేట జిల్లా కోస్గి మండలం సారంగరావుపల్లి గ్రామంలో జనాభా 600 మంది. అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారే. ఇందులో 90శాతం వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తారు. ఈ గ్రామంలో 80ఏండ్ల పైబడిన వారు, ఐదేండ్లలోపు చిన్నారులే కనిపిస్తారు. గ్రామంలో ఉపాధి లేక 450 మంది దుబారు, అరబ్‌ దేశాలైన ఖతార్‌, సౌదీలకు వలసెళ్లారు. ఇక్కడ వర్షాధార పంటలు తప్ప నదులు, ఎత్తిపోతల పథకాలేమీలేవు. బతుకుదెరువు కోసం గ్రామస్తులకు వలసలే శరణ్యం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 30మంది విద్యార్థులుండేవారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో నడిపిస్తున్నారంటే వలసలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామం నుంచి 300మంది పైగానే హైదరాబాద్‌, ముంబాయి వంటి ప్రాంతాలకు వలస పోయారు. గ్రామంలో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు అధికంగా సాగు చేస్తారు. ఈ గ్రామం నుంచి అత్యధికులు వలసపోవడంతో ఖరీఫ్‌లో వేసిన పత్తిని తీయడానికి ఏపీలోని మంత్రాలయం, గుంటూరు, పిడుగురాళ్ల, కర్నూలు నుంచి వస్తున్నారు. 250మంది కూలీలు గ్రామానికి పత్తి తీయడానికి వచ్చారు. గ్రామం నుంచి వలసలు పోకుంటే కూలీ కోసం ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేదని రైతు తిరుపతయ్యగౌడ్‌ అంటున్నారు.
వలస వెళ్లిన వారి లెక్కలు జిల్లాల వారీగా..
జిల్లా              ప్రభుత్వ లెక్కలు        అంచనా
నారాయణపేట 15000                   4లక్షలు
మహబూబ్‌నగర్‌ 10000                  2లక్షలు
వనపర్తి             8000                  3లక్షలు
నాగర్‌కర్నూల్‌     9000                  3లక్షలు
గద్వాల             8000                  2లక్షలు

No comments:

Post a Comment