Breaking News

07/11/2019

అదిలాబాద్ గులాబీ ముళ్లు...

మళ్లీ ఇంటర్నెల్ వార్
అదిలాబాద్, నవంబర్ 7, (way2newstv.in)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఏకంగా సభలు, సమావేశాలను వదలకుండా టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసి, ప్రతిపక్షాలు ఆశ్చర్యం పోయారట. దీనికి తాజాగా జరిగిన ఉట్నూరు ఐటిడిఎ పాలకవర్గం సమావేశం వేదికైంది. ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమావేశానికి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధులు అటెండయ్యారు.  అయితే ఈ మీటింగ్ సాక్షిగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయట. సమావేశంలో నిర్మల్‌లో తేనే పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారట మంత్రి ఇంద్రకరణ్. 
అదిలాబాద్ గులాబీ ముళ్లు...

నిర్మల్‌లో మంత్రి నియోజకవర్గంలో తేనే ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే కోనప్ప. నిర్మల్‌లోనే ఎందుకు పరిశ్రమను ఏర్పాటు చేస్తారని సమావేశంలోనే మంత్రిని ప్రశ్నించారట. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, మంత్రి ఇలాకాలో ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారట. ఈ సందర్భంగా మీరు మంత్రిగా సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే వెనుకబడిన, సిర్పూర్ టి నియోజకవర్గం పరిస్థితి ఏంటని రుసరుసలాడట. అంతేకాదు ఒకదశలో మంత్రి ఎమ్మెల్యే మధ్య పరిశ్రమ ఏర్పాటుపై వాగ్వాదం తారాస్థాయికి చేరిందట. కోనప్ప, మంత్రి మధ్య నువ్వెంత అంటే నువ్వెంతనే స్థాయికి చేరడంపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారట. మూడేళ్ల కింద కూడా ఇలాంటి ప్రతిపాదనపై ఇద్దరి మధ్యా గొడవ జరిగిందట. నాడు కూడా మంత్రి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కోనప్ప శాంతించలేదట. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మాదిరిగా మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం సాగడంపై టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన మంత్రి, సొంత నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే కొన్ని రోజుల క్రితం కోనప్ప తమ్ముడు, కొమ్రంభీం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణ, అటవీ అధికారి వనితపై దాడి చేశాడు. ఆ తరువాత క్రిష్ణను అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోడుభూముల సమస్యను మంత్రి పరిష్కరించకపోవడం వల్లే, తన తమ్ముడు జైలుపాలు కావాల్సి వచ్చిందని కోనప్ప రగిలిపోయారట. అప్పట్లో మంత్రి హాజరైన జడ్పీ సమావేశాన్ని కోనప్ప బహిష్కరించడం సంచలనమైంది.‌ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పరిష్కరించడానికి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి సయోధ్య కుదుర్చారట. కాని ఐటిడిఎ పాలకవర్గం సమావేశంలో మళ్లీ ఉప్పు, నిప్పులా మంత్రి ,కోనప్ప మధ్య విభేదాలు బయటపడ్డాయన్న చర్చ జరుగుతోంది. బహిరంగ సమావేశాల్లోనూ టీఆర్‌ఎస్‌ విభేదాలు రచ్చకెక్కడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లడానికి నాయకులు సిద్దమవుతున్నారట. ఇలాగైతే మున్సిపోల్స్‌లో పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని టెన్షన్‌ పడుతున్నారట.

No comments:

Post a Comment