Breaking News

29/08/2019

ముందు నుయ్యి వెనుక గోయ్యి

అయోమయంలో యడ్డీ
బెంగళూర్, ఆగస్టు 29, (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు ఎటూ పాలుపోవడం లేదు. ముఖ్యమంత్రి అయ్యానన్న సంతోషం ఆయనలో ఏమాత్రం కన్పించడం లేదు. ఇందుకు కారణం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వమే కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. యడ్యూరప్పకు ఏమాత్రం సంబంధం లేకుండా మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇక శాఖల కేటాయింపు కూడా ముఖ్యమంత్రి యడ్యూరప్ప అభీష్టం మేరకు జరగలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఆ తర్వాత శాఖల కేటాయింపులు యడ్యూరప్పకు నిద్రలేకుండా చేస్తున్నాయి.అవును అంతా హైకమాండ్ దే. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడచుకోవాల్సిందే. 
ముందు నుయ్యి వెనుక గోయ్యి

కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలి, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కేంద్ర నాయకత్వం ఆర్డర్స్ ఇవి. ఇలా ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను నామమాత్రం చేశారని అప్పట్లోనే విమర్శలు విన్పించాయి. సుదీర్ఘకాలం కర్ణాటక రాజకీయాల్లో ఉన్న యడ్యూరప్ప బీజేపీ ఎదుగుదలకు ఎంతో పాటుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప లేకుంటే బీజేపీ ఎదుగుదల కష్టమేనన్నది అందరూ అంగీకరించే అంశమే.కానీ యడ్యూరప్పకు వయసు మీద పడటం, గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అవినీతి మరకలు అంటుకోవడంతో అధిష్టానం ఈసారి ఆచితూచి అడుగులు వేస్తోంది. యడ్యూరప్పకు చెక్ పెట్టేందుకు అంతా తానే అయి వ్యవహరించింది. ఇప్పుడు అదే కొంప ముంచేలా ఉంది. బీజేపీ సీనియర్ నేతలు ఇప్పుడు యడ్యూరప్ప సర్కార్ పైన గుర్రుగా ఉన్నారు. తమకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని కొందరు, సరైన శాఖలు కేటాయించలేదని మరికొందరు, ఉపముఖ్యమంత్రులు ముగ్గురు ఎందుకంటూ ఇంకొందరూ క్రమంగా తమ అసమ్మతి గళాన్ని విన్పిస్తున్నారు.నిజానికి తన కేబినెట్ లో ఎవరెవరు ఉండాలన్న అధికారంముఖ్యమంత్రిదే. యడ్యూరప్ప కి అయితే ఎవరెరెవరికి మంత్రిపదవులు? ఎవరెవరికి ఏ శాఖలు? ఎవరు ఉపముఖ్యమంత్రులు అన్నదానిపై స్పష్టమైన అవగాహన ఉంది. బలమైన నేతలను గుర్తించి వారిలో అసంతృప్తి రగలకుండా యడ్యూరప్ప మాత్రమే పదవుల పంపకం చేయగలరు. కానీ ఈసారి అలా జరగకపోవడంతో యడ్యూరప్ప సర్కార్ ఇబ్బందుల్లో ఉన్నట్లే కనపడుతోంది. సీనియర్ నేతలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ యడ్యూరప్పను వదలడం లేదు. మొత్తంమీద అటు అధిష్టానం పోకడ, ఇటు సీనియర్ల అసంతృప్తితో యడ్యూరప్పకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

No comments:

Post a Comment