Breaking News

27/04/2019

పోలీసులే ..దొంగల అవతారం

నెల్లూరు, ఏప్రిల్ 27 (way2newstv.in
ప్రజల సొత్తును కాపాడాల్సిన పోలీసులే దొంగల అవతారం ఎత్తి, దోపిడీలకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. ఇటీవల గూడురు వద్ద రైలులో జరిగిన దోపిడీ కేసులో నలుగురు పోలీసులకు ప్రమేయం ఉన్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తిని బెదిరించి రూ.50 లక్షలు చోరీ చేసిన కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే డీఎస్పీ జి.వసంతకుమార్‌ మీడియాకు వెల్లడించారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. కావలిలోని పీఎంఆర్‌ సిల్వర్‌ ప్యాలెస్‌లో పనిచేసే అనిత, మరో యువతితో కలిసి రూ.50 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 15న చెన్నైకు వెళ్లారు. అయితే, ఆ సొమ్మును కాజేయడానికి అనిత తన ప్రియుడితో కలిసి పథకం వేసింది. దీనికి రవి తన స్నేహితులైన ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సాయం తీసుకున్నాడు. 


పోలీసులే ..దొంగల అవతారం 

పథకం ప్రకారం వీరంతా గూడూరు రైల్వే స్టేషన్‌లో అనిత నుంచి ‘పన్ను చెల్లించని సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నామని’ చెప్పి నగదుతో ఉడాయించారు.ఈ ఘటనపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో అనిత ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన నెల్లూరు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు విచారణలో అనితే తన ప్రియుడితో కలిసి నగదు కొట్టేయడానికి పథకం వేసినట్టు తేలింది. ఈ కేసులో అనితతోపాటు ఆమె ప్రియుడు రవిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు రూ.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు వెంకటగిరి 9వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు మహేష్‌, సుల్తాన్‌ బాషా, సుమన్‌ కుమార్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ఆర్‌ఐ ఉన్నారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వీరిని పట్టుకుంటామని రైల్వే డీఎస్పీ తెలియజేశారు. ఈ దోపిడీకి నిందితులు నెల రోజుల ముందు నుంచే పక్కా ప్రణాళిక వేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. గతంలో జరిగిన ఇలాంటి ఘటనల్లో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము పోలీసులమంటే ఎవరికీ అనుమానం రాదనే అభిప్రాయంతోనే దొంగలుగా అవతారం ఎత్తారు. ఎలా బెదిరించాలి, డబ్బు తీసుకుని ఎక్కడకు వెళ్లాలనే విషయాలపై పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు

No comments:

Post a Comment