Breaking News

04/01/2020

ఇక ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు...

విజయవాడ, జనవరి 4 (way2newstv.in)
సమున్నత జాతీయ పార్టీగా ఉమ్మడి ఏపీని అనేక పర్యాయాలు పాలించిన పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇక, కాలగర్భంలో కలిసిపోయినట్టేనా? ఆ పార్టీ గురించి ఏపీలో చెప్పుకోవాల్సి వస్తే.. ‘లాంగ్‌ లాంగ్ ఎగో’ అంటూ ప్రారంభించాల్సిందేనా? అంటే ఔననే అంటున్నారు మేథావులు. రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ విభజన వేడి నేపథ్యంలో ఏపీలో 2014 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురైంది. ఆ తర్వాత రఘువీరారెడ్డి వంటి వారు పార్టీని ముందుకు నడిపించేందుకు అనేక రూపాల్లో ప్రయత్నించారు. పాదయాత్రలు చేశారు.పార్టీ నుంచి బ‌యటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి రావాలంటూ ఘర్‌ వాపసీ నినాదాలు ఇచ్చారు. 
ఇక ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు...

ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు కూడా రఘువీరా శక్తి వంచనలేకుండా పార్టీని బతికించుకునేందు కు గౌరవ ప్రదమైన స్థానాలు సంపాయించుకునేందుకు రాజకీయంగా కాంగ్రెస్ పుంజుకునేలా చేసేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయన వ్యూహాలు కలిసిరాలేదు. నాయకులు కూడా పార్టీని పుంజుకునేలా చేయడంలో సహకరించలేదు. ర‌ఘువీరా 2014, 2019 రెండు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయారు.ముఖ్యంగా మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తూ రాహుల్‌ గాంధీతో ప్రకటన చేయించినా.. ప్రజల మనసులు దోచుకోలేక పోయారు. పోగొట్టుకున్న ఓటుబ్యాంకును తిరిగి సొంతం చేసుకోలేక పోయారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరా తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు కడు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక, పార్టీలో ఒకరిద్దరు నేతలు ఉన్నా.. బలమైన వాయిస్ వినిపించడంలో మాత్రం విఫలమయ్యారు. పైగా పీసీసీ రేస్‌లో ఉన్నామని చెబుతున్న శైలజానాథ్‌ వంటి వారు కూడా పదవుల వేటలో ఉన్నారే తప్ప..కాంగ్రెస్ ని నిలబెట్టేందుకు ఎక్కడా వ్యూహాత్మకంగా ముందుకు రావడం లేదు.అసలు ఏమాత్రం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ, కమ్యూనిస్టులు నేడు రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇష్టమో.. కష్టమో.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, వీటితో పోల్చుకుంటే కాంగ్రెస్‌ ఎక్కడా కనిపించడం లేదు. అమరావతి రాజధానిపై ఆ పార్టీ ఎలాంటి ఆందోళనలకు పూనుకోవడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న కొందరు విశ్లేషకులు.. ఇక, కాంగ్రెస్‌ కాలగర్భంలో కలిసిపోయిందనే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.

No comments:

Post a Comment