Breaking News

07/12/2019

ఉపాధిహామీ పథకం అమలుపై మంత్రి సమీక్ష

హైదరాబాద్ డిశంబరు 7 (way2newstv.in)
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద అన్ని గ్రామాల్లో వైకుంటధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 'పల్లె ప్రగతి (30 రోజుల ప్రణాళిక) 'అమలులో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా జీపీ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం అమలుపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి దయాకర్ రావు హైదరాబాద్లోని తన కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. 
ఉపాధిహామీ పథకం అమలుపై మంత్రి సమీక్ష

'2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 12 కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. వేతనాల అంచనా ఖర్చు రూ.1800 కోట్లు ఉంటుంది. ఇప్పటికి 9.77 కోట్ల పని దినాలు పూర్తయ్యాయి. 38.80 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరగింది. ఈ ఏడాది మెటిరియల్ కాంపౌండ్ కింద రూ.1200 కోట్లకు ఆమోదం ఉంది. ఇప్పటి వరకు జరిగిన పనులతోపాటు, హరితహారం చెల్లింపులు పోగా మిగిలిన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలి.  వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. పల్లె ప్రగతిలో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు అభివృద్ధి పనుల మంజూరులో అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డుతోపాటు అవసరమైన సీసీ రోడ్లను నిర్మించాలి. ఉపాధిహామీ పథకం పనుల ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేయాలి. జనవరిలోపు అన్ని పనులకు మంజూరు ఇవ్వాలి. శ్మశానవాటికలు నిర్మించే గ్రామపంచాయతీలకు సీసీ రోడ్లు, ఇతర పనులలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని ఒకసారి పరిశీలించి నివేదిక రూపొందించాలి. ఇంకా మొలుపెట్టని పనుల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలి. అవసరమైన చోట కొత్త పనులు చేపట్టాలి' అని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్.జీ.ఎస్.ఏ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామపంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలలో కొత్త గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భూమి లభ్యత ఉన్న వాటికే మంజూరు ఇవ్వాలని స్పష్టం చేశారు. పల్లె ప్రగతిలో పనితీరు బాగా ఉన్న గ్రామపంచాయతీలకే ఆర్. జీ.ఎస్.ఏ భవనాల మంజూరులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికారాజ్, కమిషనర్ ఎం.రఘునందన్రావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment