Breaking News

16/10/2019

దీపావళి తర్వాతే.. నామినేటెడ్ పోస్టులు

హైద్రాబాద్, అక్టోబరు 16 (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర సమితిలో మళ్లీ పదవుల పందేరం మొదలయ్యే వేళకు సమస్యలు చుట్టుముట్టాయి. లేకుంటే ఈపాటికే గులాబీ బాస్ కేసీఆర్ నామినేటెడ్ పదవులు భర్తీ చేసేవారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణతో ఎమ్మెల్యేలలో అసంతృప్తి రాజుకుంది. పార్టీని తొలి నుంచి నమ్ముకున్న నేతలు తమకు కేబినెట్ లో బెర్త్ దక్కలేదని సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారు. జోగురామన్న లాంటి నేతలయితే ఏకంగా కన్నీటి పర్యంత మయ్యారు.కేబినెట్ విస్తరణ తర్వాత తలెత్తిన అసంతృప్తిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్దుబాటు చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమై వారికి నచ్చ చెప్పారు. భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వారిలో కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని, ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ స్వయంగా చెప్పడంతో కొంత మెత్తబడ్డారు. 
దీపావళి తర్వాతే.. నామినేటెడ్ పోస్టులు

అయితే దసరా సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అనుకున్నారు.ఇంతలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో కేసీఆర్ తన దృష్టి మొత్తాన్ని హుజూర్ నగర్ ఉప ఎన్నికపైనే పెట్టారు. నామినేటెడ్ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని నిర్ణయించినా ఉప ఎన్నికలతో బిజీగా ఉండటంతో కేసీఆర్ దానిని పక్కన పెట్టేశారు. ఇదిలా ఉండగానే ఆర్టీసీ కార్మికుల సమ్మె షురూ అయింది. దీంతో కేసీఆర్ ఇక నామినేటెడ్ పోస్టుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సీరియస్ గా ఉండటంతో పదవుల విషయాన్ని కదపడానికి కూడా ఎవరూ సాహించడం లేదు.నిజానికి టీఎస్ఐసీఐసీ ఛైర్మన్ గా సీనియర్ ఎమ్మెల్యేను నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే ఛైర్మన్ గా ఉన్న బాలమల్లు పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కీలకమైన రైతు సమన్వయ సమితి, మిషన్ భగీరధ ఛైర్మన్, ఆర్టీసీ ఛైర్మన్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పదవులను మంత్రిపదవులు దక్కని సీనియర్ నేతలకు దక్కుతాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు చాలా నామినేటెడ్ పోస్టుల పాలకవర్గాల పదవీకాలం పూర్తికానుంది. అన్నీ ఒకేసారి హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment