Breaking News

23/10/2019

చంద్రబాబు బలంపై గురి

విజయవాడ, అక్టోబరు 23 (way2newstv.in)
మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుందని జానపద కధల్లో చెబుతారు. ఇక చంద్రబాబు అసలైన బలం అనుకూల మీడియా అని అంతా అంటారు. ఉత్తరాది రాజకీయాల్లో సీనియర్ అయిన మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ వంటి వారు ఏనాడో చంద్రబాబుకు మీడియా బేబీ అని ఎపుడో పేరు పెట్టేశారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవడం, దానివెనక అనూహ్యంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వెనక బలమైన మీడియా ఉందన్నది నిజం. జగన్ అసలైన సమస్య ఎదుర్కోబోతున్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది. 
చంద్రబాబు బలంపై గురి

జగన్ సర్కార్ ఆధారాలు లేని వార్తలు రాసే మీడియా మీద చర్యల కోసం ఒక జీవో తెచ్చింది. దీని మీద వెంటనే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మీడియాని నియంత్రించడం అంటూ మండిపడ్డారు. ఆ జీవో వెనక ఉద్దేశ్యం ఆయనకు బాగా తెలుసు. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సి రామచంద్రయ్య వంటి వారు టీడీపీ మీద, చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు. మీడియాను గొంతు నొక్కింది చంద్రబాబేనని కూడా ఉదాహరణలు చూపిస్తున్నారు. అదే సమయంలో మీడియాను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని దాని చిత్తశుద్ధిని ప్రశ్నార్ధకం చేశారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ జీవో పట్ల ఇపుడు తటస్థంగా ఉండే మీడియా సైతం ఆక్షేపణ వ్యక్తం చేస్తోంది. మీడియా మాటున ఉన్న కొన్ని యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చాయన్న సాకుతో అందరికీ ఒకే గాటన కట్టడం తగదని ప్రజాస్వామ్యప్రియులు అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా నెట్టుకుని వస్తారో, తాను అనుకుంటున్నట్లుగా చంద్రబాబుని, ఆయన మద్దతు మీడియాను విడదీసే విషయంలో విజయం సాధిస్తారో లేదో చూడాలి.మరి మీడియా సహకారం నాడు లేకపోబట్టే అన్న గారు కేవలం ఎనిమిది నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఇక చంద్రబాబు దాదాపు పద్నాగేళ్ళు సీఎం గా రాజ్యమేలినా, ఆయన ముమ్మారు సీఎం అయినా కూడా వెనక మీడియా ఎంతటి కీలకమైన పాత్ర పోషించిందన్నది అర్ధమవుతుంది.జగన్ ఇపుడు ఏనుగు కుంభస్థలమే గురి చూసి కొడుతున్నారు. చంద్రబాబు ఎటూ అధికారంలో లేకుండా పోయారు. ఆయన పార్టీ తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి చూసుకుంటే తాజా ఎన్నికలలో ఘోర పరాజయంతో పూర్తిగా దెబ్బతింది. ఇంతటి ఓటమి ఎపుడూ లేదు. అయినా చంద్రబాబు ఎక్కడా తగ్గడంలేదు. మెయిన్ స్ట్రీం మీడియా చంద్రబాబు వెంట ఉండడమే దానికి ప్రధాన కారణం. చంద్రబాబు ఏ మాట అన్నా కూడా అది పెద్ద చర్చ అవుతోంది. సహజంగా అది అధికార వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వంగా చూసుకుంటే జగన్ నాలుగైదు నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు.నిజంగా ఏపీలో మీడియా న్యూట్రల్ గా ఉండి వుంటే ఈపాటికి జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. అయితే మెజారిటీ సెక్షన్ టీడీపీకి ఇప్పటికీ అనుకూలంగా ఉండడంతో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇదే తీరున కనుక ముందుకు సాగితే జగన్ ఎంతలా కష్టపడినా కూడా అది జనాలకు చేరదని అర్ధమైపోయింది. మరో వైపు చంద్రబాబును మీడియా జాకీలేసి మరీ ఎత్తేస్తున్న విధానం కూడా వైసీపీ పెద్దలకు నచ్చడంలేదు. ఇపుడైతే ఫరవాలేదు, కొత్త ప్రభుత్వం కదా అని జనాలు పెద్దగా దృష్టిపెట్టరు కానీ. కొన్నాళ్ళు గడిస్తే కనుక ఈ వ్యతిరేక ప్రచారమే కొంప ముంచుతుందని కూడా వైసీపీ అంచనా వేస్తోంది.

No comments:

Post a Comment