Breaking News

08/08/2019

దేశ వ్యాప్తంగా హై అలర్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (way2newstv.in):
కశ్మీర్ విభజన, స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. డెబ్బై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్తు భారతం సిద్ధమవుతోంది. అయితే, దేశంలో ఉగ్ర దాడులు జరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 10 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. నిషేధాజ్ఞలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది.దేశవ్యాప్తంగా ఈనెల 10 నుంచి 20 వరకు విమానాశ్రయాలలో సందర్శకుల అనుమతిని రద్దు చేస్తూ విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. 
దేశ వ్యాప్తంగా హై అలర్ట్

ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలీజెన్స్ బ్యూరో హెచ్చరికతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయా గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎయిర్‌పోర్ట్‌లతో పాటు ప్రధాన నగరాల్లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో విమానాశ్రయాల్లో పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ప్రయాణికులను అణువణువు తనిఖీ చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ అజ్గర్ మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబై, పంజాబ్‌లలోని పలు రద్దీ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడటానికి జైషే మహ్మద్ సంస్థ ప్రణాళికలు రచించినట్టు ఐబీ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. ముంబైలో విధ్వసం సృష్టించే బాధ్యతను జైషే మహ్మద్ సంస్థ ముగ్గురు ఉగ్రవాదులుకు అప్పగించినట్లు సమాచారం. నగరంలో స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు ఐబీ నివేదికలో పేర్కొంది. కశ్మీర్‌లో మరో పుల్వామా తరహా దాడి జరగొచ్చన్న పాకిస్థాన్ కుట్ర పూరిత వ్యాఖ్యల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రధానంగా పీవోకేలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్రం సైన్యాన్ని అప్రమత్తం చేసింది. 

No comments:

Post a Comment