Breaking News

15/07/2019

కొత్త మద్యం పాలసీపై కసరత్తు

ఒంగోలు, జూలై 15, (way2newstv.in)
కొత్త మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. ఇందుకుగాను పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రభుత్వమే సొంతంగా మద్యం షాపులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికిగాను ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. వాస్తవానికి జూన్‌ నెలాఖరుతో మద్యం షాపుల గడువు ముగిసింది. కానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరడం.. మద్యం పాలసీ రూపొందించడంలో జాప్యంతో మద్యం షాపులకు మరో మూడు నెలలు గడువు పెంచారు. 
కొత్త మద్యం పాలసీపై  కసరత్తు

అయితే షాపుల సంఖ్యను కుదించారు. ప్రస్తుతం నూతన మద్యం విధానం తయారుచేయడంలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మద్యం పాలసీ విధానంలో సరికొత్త సంస్కరణలు తీసుకురావడం ద్వారా దశలవారీగా మద్యం నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఏటా 25 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయించింది. మూడు నెలల పాటు షాపుల నిర్వహణ గడువు పెంచినా...వాటి సంఖ్య మాత్రం ఇప్పటికే తగ్గించారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే మద్యం విక్రయాలను నిలిపివేయాలని కూడా నిర్ణయించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా కొత్త కొత్త ఆంక్షలు, నిబంధనలు విధించడం ద్వారా మద్యం నిషేధం వైపు ప్రభుత్వం అడుగులేస్తోంది.ఒక్కో మద్యం షాపులో ముగ్గురు సేల్స్‌ మెన్లు, ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలని ఎక్పైజ్‌ శాఖ ప్రతిపాదనలు పంపించింది. మద్యం షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి డిపాజిట్‌ సేకరించనున్నారు. షాపు ఆర్ధిక లావాదేవీలన్నింటికీ సూపర్‌వైజర్‌నే బాధ్యుడుగా చేయనున్నారు. ఇలా నియమించిన సిబ్బంది జీతభత్యాలు, ఇతరత్రా అలవెన్సుల విషయంపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.తమిళనాడులో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడి విధానమే మన రాష్ట్రంలో అమలు చేయాలన్నది ప్రభుత్వ భావన. ఈ విధానం అక్టోబరు 1 నుంచి అమలు చేయడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన షాపులను ఏర్పాటు చేస్తారు. షాపుల్లో ప్రభుత్వమే సిబ్బందిని నియమిస్తోంది. ప్రతి రోజు జరుగుతున్న విక్రయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దుకాణానికి వచ్చిన నిల్వ, విక్రయాలలో తేడా ఉంటే పనిచేసే సిబ్బందిపై కఠినచర్యలకు ఉపక్రమించనున్నారు. తద్వారా బెల్టు షాపులు, లూజు విక్రయాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల ఎక్సైజ్‌, అబ్కారీ శాఖపై అదనపు భారం పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు

No comments:

Post a Comment