Breaking News

06/01/2020

పరుగులు పెడుతున్న వెండి, బంగారం

ముంబై, జనవరి 6 (way2newstv.in)
పసిడి ధర పరుగులు పెడుతూనే వస్తోంది. మరోసారి భారీగా పెరిగింది. దీంతో ధర చుక్కల్లోకి చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ బంగారం మెరిసిపోయింది. అలాగే దేశీ మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడంతో పసిడి దూకుడు మీదుంది. వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.390 పెరిగింది. దీంతో పసిడి ధర రూ.38,320కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 పెరుగుదలతో రూ.41,770కు ఎగసింది.అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్ని భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అమెరికా బాగ్దాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లలో దాడి చేయడం, ఇందులో ఇరాన్ సైనికాధికారి మరణించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 
పరుగులు పెడుతున్న వెండి, బంగారం

దీంతో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. రూపాయి పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం ధర పరుగులు పెట్టింది.బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా పసిడి బాటలోనే నడిచింది. పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో ధర రూ.49,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయిఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 ఎగసింది. దీంతో ధర రూ.39,150కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.40,350కు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.200 పెరిగింది. దీంతో ధర రూ.49,600కు ఎగసింది.గ్లోబల్ మార్కెట్‌లోనూ బంగారం ధర మెరిసింది. ఔన్స్‌కు 1.30 శాతం పెరుగుదలతో 1,573.15 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.45 శాతం పెరుగుదతో 18.22 డాలర్లకు ఎగసింది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని ఎబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అభిషేక్ బన్సాల్ తెలిపారు. అంతేకాకుండా దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలిచిందని నిపుణులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment