Breaking News

20/01/2020

సిద్ధప్పకు ఇక కష్టమే

బెంగళూర్, జనవరి 20 (way2newstv.in)
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అధిష్టానం పక్కన పెట్టేసినట్లే కన్పిస్తుంది. ఆయనతో భేటీ తర్వాత పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా సిద్ధరామయ్య కొత్త మెలిక పెట్టారు. తాను ప్రతిపాదించిన వారికి పదవులు ఇవ్వకుంటే శాసనసభపక్ష పదవిలో కొనసాగలేనని చెబుతున్నారు. తన రాజీనామా ఆమోదించకపోయినా తన వారికి పదవులు ఇవ్వకుంటే తాను ఏ పదవిలోనూ కొనసాగనని తేల్చి చెబుతున్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ పదవుల పందేరం ఇంకా పూర్తికాలేదు. ఇటీవల సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసి వచ్చారు. ఆమెతో చర్చించిన తర్వాత కూడా సిద్ధరామయ్యకు క్లారిటీ రాలేదు. కర్ణాటక కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలు ఎక్కువగా ఉన్నాయని సోనియా గాంధీ అభిప్రాయపడుతున్నారు. 
సిద్ధప్పకు ఇక కష్టమే

పీసీసీ అధ్యక్షుడిగా లింగాయత్ వర్గానికి చెందిన ఎంబీ పాటిల్ ను నియమించాలని సిద్ధరామయ్య సోనియాకు వివరించినట్లు తెలిసింది.అయితే సోనియాగాంధీ అందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. సజావుగా సాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. తిరిగి సిద్ధరామయ్య వర్గానికే పీసీసీ చీఫ్ పదవిని అప్పగిస్తే పార్టీ ఇప్పట్లో కోలుకోలేదన్న నివేదికలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి అందాయి. దీంతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోనియా గాంధీ సిద్ధరామయ్యకు స్పష్టమైన సంకేతాలు సమావేశంలో ఇచ్చినట్లు చెబుతున్నారు.సోనియాగాంధీతో భేటీ తర్వాత సిద్ధరామయ్య పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. మహారాష్ట్ర తరహా పదవుల పందేరానికి కాంగ్రెస్ హైకమాండ్ సమాయత్తమయినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేత, శాసనసభ పక్షనేతగా ఇద్దరిని నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యకు చెక్ పెట్టకుంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని భావిస్తుంది. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీపై పట్టు కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment