Breaking News

28/01/2020

మండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

మండలి రద్దుకు జైకొట్టిన ఇద్దరు మంత్రులు
మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపుతారని ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 133, వ్యతిరేకంగా గానీ, తటస్థంగా గానీ జీరో ఓట్లు పడ్డాయి. దీంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనమండలి రద్దుకు అనుకూలంగా మంత్రులైన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా మండలి రద్దుకు జైకొట్టారు. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. 
మండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

ప్రస్తుతం టీడీపీకి 28, వైసీపీకి 9, పీడీఎఫ్ 5, నామినేటెడ్ 8, స్వతంత్రులు 3, బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరిలో వివిధ కోటాల్లో ఎన్నికైన 9 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు.శాసనసభ ఆమోదించినా పార్లమెంట్ ఆమోదం పొందే వరకు మండలి మనుగడలోనే ఉంటుంది. అయితే, అసలు సభ రద్దుకు ముందు జగన్ ఆయా ఎమ్మెల్సీలకు ఎలాంటి హామీ ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ పదవులతో పాటు మంత్రి పదవులను కూడా కోల్పోనున్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు కేబినెట్ భేటీలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది ఆయా నేతలు చర్చించుకుంటున్నారు.

1 comment: