Breaking News

08/01/2020

ఇరాన్ ప్రతీకారం....

టెహ్రాన్, జనవరి 8  (way2newstv.in)
ఇరాన్ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసిన ఇరాన్ అన్నంత పనిచేసింది. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 7 రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరమే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాక్‌లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో దాడిచేసినట్టు పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణి దాడిలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇరాక్‌లోని అమెరికా, సంకీర్ణ దళాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడినట్టు అగ్రరాజ్యం రక్షణ శాఖ ప్రజా సంబంధాలు శాఖ కార్యదర్శి జొనాథన్ హాఫ్‌మన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇరాన్ ప్రతీకారం....

ఇరాక్ దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. మరోవైపు, ఇరాన్‌ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఖండించారు. తాజా పరిస్థితులపై ట్రంప్‌ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, అమెరికా సైన్యాలు పశ్చిమాసియాను విడిచివెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది.ఇరాన్‌లో అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ అసద్‌లో విదేశీ బలగాలు, సంకీర్ణ దళాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ స్థావరం తొమ్మిది క్షిపణులతో ఇరాన్ దాడిచేసినట్టు స్థానిక భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. సులేమానీ అంత్యక్రియల్లో ఇరానీయన్లు సైతం తమ నేతను హత్యచేసిన అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment