Breaking News

11/12/2019

చార్జీల పెంపుపై ఒక్కటే ప్లాన్

హైద్రాబాద్, డిసెంబర్ 11,  (way2newstv.in)
అధికారంలో వున్నవారు ఎందులో ధరలు పెంచినా ప్రతిపక్షాల చేతికి ఆయుధాన్ని అందించినట్లే. ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరిగినా ఆర్టీసీ చార్జీలు మాత్రం పెంచేందుకు విపక్షాలు అంగీకరించవు. ప్రజలు ఈ విషయం లో రాజీ పడినా రైల్వే, బస్ చార్జీలు పెరిగేందుకు ససేమిరా అంటాయి విపక్షాలు. ప్రతిపక్షంలో ఏ పార్టీలు వున్నా ఇదే ధోరణి. అదే ప్రయివేట్ ట్రావెల్స్ ధరలు భారీగా పెంచి తమ సర్వీసులు నడుపుతున్నా విపక్షాలు నోరు మెదపవు.విద్యాసంస్థల్లో ఫీజుల పెంపు పైనా ఇదే ధోరణి కనిపిస్తుంది. కార్పొరేట్ విద్య సంస్థలకు లక్షల్లో అప్పో సొప్పో చేసి ప్రజలు ఫీజులు చెల్లిస్తున్న వైనం విపక్షాలకు పట్టదు. ప్రభుత్వ విద్య సంస్థల్లో ఏ మాత్రం రూపాయి పెరిగినా రోడ్ల పైకి చేరి ధర్నాలు ఉద్యమాలు విద్యా సంస్థల బహిష్కరణ చకచకా జరిగిపోతాయి. 
చార్జీల పెంపుపై ఒక్కటే ప్లాన్

ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆర్టీసీ పై నడిచిన తెలంగాణ ఉద్యమంలో సంస్థలకు వస్తున్న నష్టాలు తీవ్రంగా ప్రజల్లోకి రావడంతో ధైర్యంగా అడుగు ముందుకు వేసి చార్జీల మోత మ్రోగించాయి.తెలంగాణ లో జరిగిన ఆర్టీసీ ఉద్యమం వల్ల సంస్థ నష్టాల అంశం అర్ధమయ్యే రీతిలో ప్రజల్లో బాగా నలిగింది. విపక్షాలు సైతం అవసరమైతే చార్జీలు పెంచైనా సంస్థను రక్షించాలి అనే ధోరణికి వచ్చాయి. దాంతో ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్టీసీ పై వరాల జల్లు కురిపిస్తూ భారీగా చార్జీలు పెంచేశారు. బస్సులు సక్రమంగా తిరిగితే చాలని ధర ఎంతైనా ఫరవాలేదన్న పరిస్థితి కి అప్పటికే ప్రజలు కూడా సిద్ధం అయిపోయారు. ఇదే అదనుగా టి సర్కార్ చార్జీల మోత మోగించేసింది.దీనికోసమే చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి సర్కార్ సైతం అదే బాటలో కత్తి దూసింది. ఆర్టీసీకి నెలకు వందకోట్ల రూపాయలు ఏడాదికి 12 వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని ఇలాగే నడిస్తే సంస్థ మూత పడుతుందని ప్రభుత్వంలో విలీనం దేవుడెరుగు అంటూ చెప్పుకొచ్చింది. దీనికి చికిత్స ధరలు పెంచడమే మార్గమని పల్లెవెలుగు సిటీ సర్వీసులకు కిలోమీటర్ కి 10 పైసలు దూరప్రాంతాల సర్వీసులకు కిలోమీటర్ కి 20 పైసలు పెంచేసి నష్టాల సమస్యకు కొంత ఉపశమనం ఇచ్చేసింది. దీనిపై ఇప్పుడు వామపక్ష పార్టీలు తప్ప మిగిలిన వారు పెద్దగా నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది.

No comments:

Post a Comment