Breaking News

18/12/2019

పక్కనే ఉంటూ పుల్లలు పెడుతున్న బెహెన్

లక్నో, డిసెంబర్ 18 (weay2newstv.in)
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి కాంగ్రెస్ పై కసి తీరలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా మాయావతి కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లోబర్చుకోవడమే కాకుండా, పార్టీని విలీనం చేసుకోవడాన్ని మాయావతి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ మాయావతి కాంగ్రెస్ తో ఉత్తరప్రదేశ్ లో పొత్తు పెట్టుకోకుండానే బరిలోకి దిగారు. హర్యానాలో సయితం మాయావతి ఒంటరిపోరుకే సిద్ధమయ్యారు.మాయావతి తొలి నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవారు. ఎక్కువ కాలం అధికారంలో కాంగ్రెస్ ఉండటం వల్ల కావచ్చు. లేదా హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీని శత్రువుగా చూడటం వల్ల కావచ్చు. 
పక్కనే ఉంటూ పుల్లలు పెడుతున్న బెహెన్

మాయావతి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే వ్యవహరించారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఎన్నికల నాటి నుంచి మాయావతికి కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది.ఇందుకు ప్రధాన కారణం తమకు తక్కువ సీట్లు కేటాయించాలని చూడటం, దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ నేతలు చులకన చేసి మాట్లాడినా కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోకపోవడం వంటివి కారణాలయ్యాయి. దీనికి తోడు ఎన్నికల అనంతరం మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి కమల్ నాధ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లు కలసి బీఎస్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా మాయావతి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీకి లబ్ది చేకూరేలా కాంగ్రెస్ దళిత ఓట్లను చీల్చడంలో వ్యవహరించిందని ఆరోపించారు.ఇక తాజాగా మహారాష్ట్ర పరిణామాలపై మాయావతి స్పందించారు. కాంగ్రెస్ మహారాష్ట్రలో శివసేనతో ఎలా పొత్తు పెట్టుకుందో చెప్పాలని మాయావతి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ బిల్లును సమర్ధించిన శివసేనతో ఇంకా అంటకాగడమేమిటని మాయావతి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. రాహుల్ వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఇంకా రెండు పార్టీలూ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విధానమేంటో? చెప్పాలని మాయావతి డిమాండ్ చేశారు. మాయావతి అవకాశమొచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు.

No comments:

Post a Comment