Breaking News

12/10/2019

ఆరుగురు మినహా ఎమ్మెల్యేల గప్ చిప్

విజయవాడ, అక్టోబరు 12, (way2newstv.in)
అధికారంలో ఉంటే అంతా మనదే… అధికారం కోల్పోతే మా పని మాది. ఇది ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి నాలుగు నెలలు దాటింది. అధినేత చంద్రబాబు, మరికొందరు నేతలు తప్ప మిగతా నేతలు ఎవరు పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో లేనట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరు పని వారు చూసుకుంటున్నారు. నలుగురు, ఐదుగురు తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరు వైసీపీ ప్రభుత్వంపై పోరాడటం లేదు.ఇప్పుడే వైసీపీ మీద దూకుడుగా వెళితే తమపై ఉన్న పాత కేసులు ఏమన్నా బయటకుతీస్తారనే భయమో లేక మన పని మనం చేసుకుందాంలే అనే భావనో తెలియదు గానీ ఎమ్మెల్యేలు కంటికి కనిపించడం లేదు. 
 ఆరుగురు మినహా ఎమ్మెల్యేల గప్ చిప్

టెక్కలి(శ్రీకాకుళం) ఎమ్మెల్యే గా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు(పశ్చిమ గోదావరి) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, రాజమండ్రి రూరల్(తూర్పు గోదావరి) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం (తూర్పు గోదావరి) ఎమ్మెల్యే చినరాజప్ప, చీరాల (ప్రకాశం) ఎమ్మెల్యే కరణం బలరాం తప్ప మిగతా ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారు.ఒక్కసారి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితిని గమనిస్తే…ఇచ్చాపురం ఎమ్మెల్యేగా ఉన్న అశోక్‌ బెందాళం మొదట్లో కొంచెం యాక్టివ్ గానే కనిపించిన, తర్వాత కొంచెం సైలెంట్ అయినట్లు అనిపిస్తోంది. ఇక విశాఖపట్నం ఎమ్మెల్యేల విషయానికొస్తే ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కొంచెం జిల్లాలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే అసలు అడ్రెస్ లేరు. రేపో మాపో ఆయన పార్టీ మారిపోతారని కూడా ప్రచారం జరుగుతుంది.అటు  టీడీపీ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పూర్తిగా డీ-యాక్టివ్ మోడ్ లో ఉన్నారు. తూర్పుగోదావరి లో బుచ్చయ్య చౌదరి, చినరాజప్పలు పార్టీ కోసం కష్టపడుతున్నారు. బుచ్చయ్య, రాజ‌ప్ప ఎప్పటిక‌ప్పుడు విప‌క్షంపై అసెంబ్లీలోను, బ‌య‌ట విరుచుకు ప‌డుతున్నారు. ఇక మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. భ‌వానీ జూనియ‌ర్ కావ‌డంతో ఆమె ఏం మాట్లాడేందుకు ఇష్ట ప‌డ‌డం లేదు. అదేమ‌న్నా అంటే బాబాయ్ అచ్చెన్న ఉన్నాడుగా అని స‌రిపెట్టేసుకుంటున్నార‌ట‌.ఇటు వెస్ట్ గోదావరి టీడీపీలో రామానాయుడు ఫుల్ యాక్టివ్ గా ఉండగా, ఉండి ఎమ్మెల్యే కలవపూడి రాంబాబు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. కృష్ణాలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటున్నారు. అయితే కీల‌క జిల్లా నుంచి పార్టీ త‌ర‌పున వీళ్లు ఇద్దరే గెలిచినా ఇద్దరు అధికార పార్టీ త‌ప్పు ఒప్పులు మాత్రం ఎత్తి చూప‌డం లేదు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కొంచెం పార్టీ కార్యక్రమాల్లో కనబడుతున్నారు గానీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే అడ్రెస్ లేరు.ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్లు కూడా నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఏలూరు సాంబ‌శివ‌రావు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్యటిస్తూ స్థానికంగా త‌న గ్రిప్ త‌గ్గకుండా చూసుకుంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోనే ఉన్నారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి తెలిసిందే. ఆయ‌న గెలిచిన‌ప్పుడే నియోజ‌క‌వ‌ర్గానికి చాలా దూరం… ఇప్పుడు పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో పూర్తిగా సినిమా షూటింగ్‌ల్లోనే ఉంటున్నారు. టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పార్టీని భుజాల మీద మోస్తూ వెళుతున్నారు. మొత్తం మీద 23 మంది ఎమ్మెల్యేలలో చాలామంది ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ గా ఉండిపోయారు

No comments:

Post a Comment