Breaking News

19/10/2019

ప్రశాంతంగా బంద్

హైద్రాబాద్ద్, అక్టోబర్ 19 (way2newstv.in)
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రోజు రోజుకూ తీవ్రతరమవుతోంది. అక్టోబరు 5 నుంచి కొనసాగుతోన్న బంద్ 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, ఉద్యోగ సంఘాలు సైతం సంఘీభావం తెలిపాయి. మరోవైపు, బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.బంద్‌ నేపథ్యంలో ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బోధన్‌ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. 
ప్రశాంతంగా బంద్

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌, రాణిగంజ్‌, కంటోన్మెంట్‌ల్లోనూ బస్సులను డిపోల నుంచి కదలనివ్వలేదు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచే కార్మికులు, ప్రజా సంఘాలు డిపోల వద్దకు చేరుకుని బస్సులు అడ్డుకుంటున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం వైఖరిపై మండిపడుతున్నారు. డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సైతం విధులకు హాజరుకాలేదు.మరోవైపు, ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగింది. కార్మిక సంఘాలను వెంటనే చర్చలకు పిలవాలని హైకోర్టు సూచించింది. అయితే,తీర్పు ప్రతి అందేవరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీకి రెగ్యులర్‌ ఎండీని నియమించని ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కార్మికులకు జీతాలు పెంచితే ఆర్టీసీ మరింత కుదేలవుతుందని ఆ సంస్థ యాజమాన్యం తన అఫిడ్‌విట్‌లో స్పష్టం చేసింది. కాగా, శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.

No comments:

Post a Comment