Breaking News

21/09/2019

కొణతల కు దారేదీ

విశాఖపట్టణం, సెప్టెంబర్ 21, (way2newstv.in)
ఉత్తరాంధ్రలో ప్రత్యేక ముద్ర వేసుకున్న కొణతాల రామకృష్ణ రాజకీయంగా వేసిన తప్పటడుగులు ఆయనను పాలిటిక్స్ కు బాగానే దూరం చేశాయి. అయితే కొణతాల రామకృష్ణ ఇప్పటికే పదేళ్లకు పైగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏ పార్టీలో చేరకుండా దాదాపు దశాబ్దకాలం ఆయన గడిపారు. అయితే పార్టీలో లేకపోయినా ఉత్తరాంధ్ర సమస్యల పట్ల ఉద్యమిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన ఎప్పటికప్పుడు సమావేశాలు పెడుతుంటారు. అన్ని పార్టీల నేతలను పిలిచి సమస్యలపై చర్చిస్తుంటారు.విశాఖ రైల్వే జోన్ కోసమయితే ప్రత్యేకంగా రైలులో ఢిల్లీకి వెళ్లి కొణతాల రామకృష్ణ నిరసన తెలిపారు. ఇక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటయినా ప్రత్యేకంగా విశాఖకు ఒరిగిందేమీ లేదంటూ గళం విప్పారు. 
 కొణతల కు దారేదీ

ఇక పూర్తిగా వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగు నీటికోసం ఆయన కొన్నేళ్లుగా ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక ఉద్యమాలు చేశారు. ఎన్నికల సమయంలోనూ అన్ని పార్టీల అధినేతలను కొణతాల రామకృష్ణ స్వయంగా కలసి తమ మ్యానిఫేస్టోలో ఉత్తరాంధ్ర సమస్యలను పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.అయితే ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో కూడా సమావేశమయ్యారు. అనుచరులు కూడా అధికమంది వైసీపీలోనే చేరాలని నినదించారు. ఈ మేరకు ఆయన వైఎస్ జగన్ ను లోటస్ పాండ్ లో కలిశారు. జగన్ కూడా కొణతాల రామకృష్ణ చేరేందుకు ఓకే చెప్పారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. ఇందుకు వైసీపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకోకుండానే వెనుదిరిగి పోయారు.చివరకు ఆయన టీడీపీకి ఈ ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సమస్యలు తీరాలన్నా, ప్రత్యేక హోదా ఏపీకి రావాలన్నా టీడీపీతోనే సాధ్యమని కొణతాల రామకృష్ణ ఎన్నికలకు ముందు చెప్పారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. చివరకు వైసీపీ అధికారంలోకి రావడంతో కొణతాల రామకృష్ణ సైలెంట్ అయ్యారు. ఉత్తరాంధ్ర సమస్యలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడుస్తున్నా కొణతాల రామకృష్ణ మాత్రం తన స్వరాన్ని ఎక్కడా విన్పించకపోవడం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చర్చనీయాంశమైంది.

No comments:

Post a Comment