Breaking News

28/08/2019

ఉనికి కోసం టీ కాంగ్రెస్ పోరాటం

హైద్రాబాద్, ఆగస్టు 28, (way2newstv.in)
తెలంగాణ కాంగ్రెస్ జవసత్వాలు కోల్పోయింది. వరస ఓటములతో ఆపార్టీ ఇబ్బందులు పడుతోంది. నాయకత్వ సమస్య ఒక కారణమయితే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస పార్టీ దెబ్బతినడం మరొక కారణం. క్యాడర్ లోనూ ఉత్సాహం లేదు. నేతలు కూడా తూతూ మంత్రంగా తంతు నడిపేస్తున్నారు. ఈనేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అందుకోసం ప్రణాళిక బద్ధంగా అడుగులు వేయాలని నిర్ణయించింది.తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ ఓటర్లు తమ వైపే ఉంటారని కాంగ్రెస్ పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. ఇందుకు గాను రిజర్వేషన్ల అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. 
ఉనికి కోసం టీ కాంగ్రెస్ పోరాటం

రిజర్వేషన్ల అంశం ప్రాతిపదికగా కొన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. బీసీలను మచ్చిక చేసుకునేందుకు వారికి పదవుల ఆశను చూపుతోంది.మున్సిపల్ ఎన్నికల్లో యాభై శాతం సీట్లను బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారిపై కన్నేసింది. బీసీలను తమవైపునకు తిప్పుకుని కేసీఆర్ కు చెక్ పెట్టాలన్న వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మున్సిపాలిటీల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలలో గెలుపు కోసం పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని కాంగ్రెస్ నియమించింది.బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని డిసైడ్ అయింది. కేసీఆర్ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు దిగింది. కేసీఆర్ బీసీ రిజర్వేషన్లలో కోత విధిస్తున్నారని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అన్ని మున్సిపాలిటీ పరిధిలో దీనిపై ఆందోళనకు దిగాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వాస్తవానికి బీసీలకు 36 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నా కేసీఆర్ కోత విధించడాన్ని తప్పు పడుతూ బీసీ మంత్రం జపిస్తోంది. చూద్దాం….మున్సిపల్ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటుందేమో.

No comments:

Post a Comment