Breaking News

24/08/2019

ఎమర్జెన్సీతో ఫుల్ టైం రాజకీయ నాయకుడు

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (way2news.in - Swamy Naidu)
అలుపెరుగని ఆ రాజకీయ నాయకుడు అస్తమించారు. ఆర్థిక మంత్రిగా తన మార్కును చూపించిన అరుణ్‌ జైట్లీ.. జీఎస్టీ వంటి సాహోసేత నిర్ణయాలను విజయవంతంగా అమలు చేసి భారత ఆర్థిక నిపుణులనే ఆశ్చర్యపరిచారు. అటు న్యాయశాస్త్రంలో.. ఇటు రాజనీతిలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ జైట్లీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక నాయకుడిగా ఎదిగారు.  అరుణ్ జైట్లీ 1952, నవంబర్ 28న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ కూడా తండ్రిబాటలోనే నడిచారు. డిగ్రీతోపాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువే రోజుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పుడే ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు.  జైట్లీని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మార్చిన ఘటన జైలు శిక్షే. దేశంలో అత్యవసర పరస్థితి (ఎమర్జన్సీ విధించినప్పుడు జైట్లీని జైలుకు తరలించారు. 19 నెలలపాటు ఆయన జైల్లోనే గడిపారు. 
ఎమర్జెన్సీతో  ఫుల్ టైం రాజకీయ నాయకుడు
విడుదల తర్వాత ఆయన జనసంఘ్ పార్టీ (ప్రస్తుతం బీజేపీ)లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్) ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1999లో అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా జైట్లీ పని చేశారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2017లో రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ బాధ్యతలను కూడా జైట్లీనే చేపట్టారు. ఈ ఏడాది మళ్లీ బీజేజీ అధికారంలోకి వచ్చినా.. అనారోగ్య పరిస్థితుల వల్ల కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు

No comments:

Post a Comment