హైద్రాబాద్,ఆగస్టు 27, (way2newstv.in)
పబ్లిక్ గార్డెన్స్. చెప్పుకోవడానికి చరిత్ర ఘనం. పార్కులోకి తొంగి చూస్తే అంతా పురాతనం. ఇప్పుడు ఎవరైనా పార్కుకు కుటుంబ సభ్యులతో హాయిగా, పిల్లలతో సరదాగా గడిపేందుకు వస్తే.. ఇక్కడ ఇబ్బందులే పలుకరిస్తాయి. పచ్చదనం లేక.. పిల్లలు ఆడుకునేందుకు ఆటవస్తువులు లేక ఈ ఉద్యానవనం నిరాదరణకు గురవుతోంది. దూరమైనా ఇతర పార్కులకు వెళ్తున్నారు. కూర్చునేందుకు సరిపడా బల్లలు లేవు. ఇక్కడ నిజాం కాలంలో ఏర్పాటు చేసిన నీటి ఫౌంటెయిన్లు నేటికీ అలాగే ఉన్నాయి. పైపులు తుప్పు పట్టి పాడై ఫౌంటైయిన్లు పనిచేయడం లేదు.
అధ్వాన్నంగా పబ్లిక్ గార్డెన్స్
పార్కులో దాహం వేసి మంచినీరు తాగుదామంటే ఎక్కడా చిన్న కుళాయి కనిపించదు. మహిళలకు మరుగుదొడ్లు లేవు. నరికేసిన చెట్ల మోడులు దర్శనమిస్తాయి. పార్కులో ఉన్న సరస్సు ఎండిపోయి పిచ్చిమొక్కలు పెరిగాయి.ఈ పార్కును నిజాం కాలంలో కట్టించారు. చరిత్రకు చెదలు పట్టినట్లే ఈ పార్కులో నిర్లక్ష్యపు దుమ్ము పేరుకుంది. మౌలిక వసతుల కల్పన లేదు. ఆహ్లాదం అనే మాట ఆమడ దూరంలో ఉంది. పచ్చదనం పూర్తిగా మటుమాయమయ్యే పరిస్థితి నెలకొంది. పార్కును 1846లో ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. నిజాం కాలంలో దీనిని బాగమ్ అని పిలిచేవారు. ఉర్దూలో బాగ్ అంటే గార్డెన్ అని ఆమ్ అంటే ప్రజలు అని అర్థం. చారిత్రక సంపదను తెలుసుకోవాలనుకునే వారికి పక్కనే పురావస్తు ప్రదర్శనశాల దర్శనమిస్తుంది. దీనిని 1920లో నిజాం ఇండో-సార్సినిక్ శైలిలో ఈ ప్రదర్శనశాలను నిర్మించారు. దీనికి సమీపంలోనే జూబ్లీహాల్ ఉంది. అక్కడే జవహర్ బాలభవన్, అసెంబ్లీ భవన్ వంటి చారిత్రక ప్రదేశాలు ఉండటంతో పబ్లిక్గార్డెన్కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. అసెంబ్లీ ఉండటంతో నిత్యం పోలీసుల పహారా ఉంటుంది. ఇక్కడ సౌకర్యాల లేమి పట్టి పీడిస్తోంది.
No comments:
Post a Comment