Breaking News

10/08/2019

ఆగస్టు 18న బీజేపీ భారీ బహిరంగసభ

హైద్రాబాద్, ఆగస్టు 10 (way2newstv.in- Swamy Naidu)
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంలో ఆగస్టు 18న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ విభాగం తెలిపింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హజరుకానున్నారు. వీరి సమక్షంలో ఇతర పార్టీల నుంచి నాయకులు చేరనున్నట్లు సమాచారం. గతంలోనే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు కూడా బహిరంగ సభలో అధికారికంగా మరోసారి పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన సుమారు 20 మంది రాష్ట్ర నాయకులు కూడా కమలం గూటికి చేరనున్నారు. 
ఆగస్టు 18న బీజేపీ భారీ బహిరంగసభ
తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సందర్భంలో.. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన చాలా మంది నాయకులు బహిరంగ సభ నేపథ్యంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పుంజుకోవడానికి ఈ బహిరంగ సభ దోహదపడనుంది. సెప్టెంబర్‌లో మరోసారి.. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తానే స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని అమిత్ షా గతంలో పార్టీ సమావేశంలో చెప్పారు. ప్రతి నెలా రాష్ట్రానికి వస్తానన్నారు. ఈ మేరకు మరోసారి సెప్టెంబర్‌లో కూడా తెలంగాణకు వస్తానని శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులకు అమిత్ షా హామీ ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించి, హైదరాబాద్‌లోనే బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకోనున్నారని తెలుస్తోంది. 

No comments:

Post a Comment