Breaking News

23/07/2019

ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు సభ్యుల సస్పెన్షన్

విజయవాడ, జూలై 23 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడిని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేయాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. దీంతో డిప్యూటీ స్పీకర్ వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. తమను సస్పెండ్ చేయడం అన్యాయమని ముగ్గురు సభ్యులు సభలో కూర్చోగా మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. సస్పెండ్ అయిన ముగ్గురు సభ్యులు టీడీపీ శాసన సభాపక్ష ఉపనాయకులే కావడం గమనార్హం. మంగళవారం ప్రారంభం నుంచి సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌, పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. 
ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు సభ్యుల సస్పెన్షన్

ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూర్చోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందడంతో ముగ్గురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. సభ నుంచి సస్పెన్షన్‌కు గురైనా ముగ్గురు ఎమ్మెల్యేలు సభలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సభా సంప్రదాయాలు పాటించని వారిని సభ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కోరారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని మండిపడ్డారు. సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించిన సభ్యులను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. 
టీడీపీ సభ్యుల వాకౌట్ఏ పీ అసెంబ్లీలో ఈరోజు కీలక పరిణామాలు సంభవించాయి. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడంతో సభ వేడెక్కింది. ఆ తర్వాత కూడా సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద సభను నిర్వహిస్తున్న తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్సెండ్ తొలగించే అవకాశం
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ తో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం టీడీపీ సభ్యులను డిప్యూటీ స్పీకర్ మరోసారి చర్చలకు పిలిచారు. కాసేపట్లో సస్పెన్షన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments:

Post a Comment