ఎన్నికల వాగ్ధానాలను ఖచ్చితంగా నెరవేరుస్తా
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం జూలై 2(way2newstv.in)
ఎన్నికల ప్రచారం సందర్బంగా ప్రజలకు ఏవైతే వాగ్ధానాలు చేశానో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్. మాట మార్చడం తనకు చేతకాదన్నారు.నన్ను మీ బిడ్డగా ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించారు... మీ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపారు... అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు అని అన్నారు. స్థానిక 4వ డివిజన్లోని కమ్యూనిటీ హాలులో 3, 4, 8 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. నగర టీడీపీ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త కాదన్నారు. శ్రీకాకుళంలో తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడిని చూస్తూ పెరిగానన్నారు. నగర ప్రజల ప్రతినిధిగా మీకు నాకు అవకాశం ఇచ్చా... అసెంబ్లీలో నగర ప్రజల గొంతునై పోరాడతానని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గజిబిజి పాలన సాగుతోందని విమర్శించారు.
మాట మార్చను మడమ తిప్పను
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అధికారంలో లేనంత మాత్రానా కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఏ కష్టం వచ్చినా నాయకత్వం అంతా మీ ముందుండి పోరాడతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాజమహేంద్రవరం నగరానికి సంబంధించి సుమారు 60 వేల మందికి పసుపు - కుంకుమ కింద నగదు ఇప్పించామని, అనేక మందికి పెన్షన్లు మంజూరు చేయించామన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్కు ఇచ్చినట్టే మద్దతు ఇచ్చి అధిక స్థానాలు కౌవసం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేసి వారిని రోడ్డున పడేసి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరే విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ జగన్ క్యాబినేట్లో అందరూ అవినీతి పరులేనని విమర్శించారు. ఆంధ్ర ఆస్తులను తెలంగాణాకు జగన్ దోచి పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి ఎలా వీచినా రాజమహేంద్రవరంలో మాత్రం సైకిల్ స్పీడ్కు ఎవరూ బ్రేకులు వేయలేకపోయారని అన్నారు. ఇదే ఉత్సాహాన్ని త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కనబరిచి నగరపాలక సంస్థలో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్ పాలక శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్, నాయకులు నక్కా చిట్టిబాబు, బొమ్మనమైన శ్రీనివాస్, కుడుపూడి సత్తిబాబు, షేక్ సుభాన్, బుడ్డిగ రాధ, జక్కంపూడి శ్రీరంగనాయకులు, సూరంపూడి శ్రీహరి, నక్కా దేవీ, జక్కంపూడి అర్జున్, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment