Breaking News

24/07/2019

పేరు మార్చుకోవడంతో యడ్డీకి కలిసోచ్చిందా

బెంగళూర్, జూలై 24, (way2newstv.in)
కర్ణాటకలో నాటకీయ పరిణామాల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప  కర్ణాటక ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోనున్న తరుణంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు కాబోయే సీఎం యడ్యూరప్ప జీవితంలోని ఆసక్తికర వివరాలు.. దక్షిణ భారత దేశంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి యడ్యూరప్పే కావడం విశేషం. యడ్యూరప్ప ఇప్పటి వరకు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు (2007, 2008, 2018) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప. 
పేరు మార్చుకోవడంతో యడ్డీకి కలిసోచ్చిందా

ఆయన స్వస్థలం కర్ణాటకలోని మాండ్యా జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని బూకనకెరె గ్రామం. సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943 ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. తుమకూరు జిల్లా యెడియూర్ గ్రామ సిద్ధలింగేశ్వరుడు వారి కులదైవం. అందుకే యడ్యూరప్పకు ఆ పేరు పెట్టారు. యడ్యూరప్పకు నాలుగేళ్ల వయసులో ఆయన తల్లి పుట్టతాయమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతరం అనేక ఇబ్బందులు పడుతూ ఆయన విద్యాభ్యాసం సాగించారు. ఇంటర్ వరకు ఆయన మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో చదివారు. 1965లోనే సాంఘిక సంక్షేమ శాఖలో డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించారు. డివిజనల్ క్లర్క్ ఉద్యోగాన్ని కొద్ది రోజులకే వదిలేసిన యడ్యూరప్ప.. అనంతరం శికరిపుర వెళ్లిపోయారు. అక్కడ వీరభద్రశాస్త్రి రైస్ మిల్లులో క్లర్క్‌గా చేరారు. 1967లో రైస్ మిల్ యజమాని కుమార్తె మైత్రాదేవిని వివాహం చేసుకున్నారు. మైత్రాదేవి, యడ్యూరప్ప ఒకర్నొకరు ఇష్టపడి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం శివమొగ్గలో యడ్యూరప్ప ఓ హార్డ్‌వేర్ షాపును ప్రారంభించారు. కాలేజీ రోజుల్లోనే యడ్యూరప్ప ఆర్ఎస్ఎస్‌ భావజాలం పట్ల ఆకర్షితుడయ్యారు. హిందూత్వాన్ని బాగా ఫాలో అయ్యేవారు. ఈ నేపథ్యంలోనే యెడియూరప్ప గా ఉన్న తన పేరును జ్యోతిషశాస్త్రం ప్రకారం 2007లో యడ్యూరప్ప గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. యడ్యూరప్ప, మైత్రాదేవి దంపతులకు రాఘవేంద్ర, విజయేంద్ర అనే ఇద్దరు కుమారులు, అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2004లో యడ్యూరప్ప భార్య నీటిసంపులో పడి మరణించారు. యడ్డీ కుమారుడు రాఘవేంద్ర 2018 ఎన్నికల్లో శికరిపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అధిష్టానం తనకు తగిన గౌరవం ఇవ్వడంలేదనే ఆరోపణలతో యడ్యూరప్ప ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో సొంతంగా పార్టీని స్థాపించారు. అయితే.. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి మళ్లీ సొంతగూటికి వచ్చేశారు. 2018లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు విజయం సాధించింది. ఫలితాల అనంతరం గవర్నర్ ఆహ్వానం మేరకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రమాణం చేసి 48 గంటలు గడవకముందే రాజీనామా చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం ఎంత కాలం ఉంటుందో చూస్తానని వ్యాఖ్యానించారు. సరిగ్గా 14 నెలల అనంతరం తన మాట నిలుపుకుంటూ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. 

No comments:

Post a Comment