Breaking News

01/07/2019

కేసీఆర్ నయా తుగ్లక్ చర్యలు


హైద్రాబాద్, జూలై 1, (way2newstv.in)
క్రటేరియట్‌లో అడుగుపెట్టని ముఖ్యమంత్రికి అసలు అక్కడి భవనాల పరిస్థితి ఎలా తెలుస్తుందని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. సచివాలయ భవనాలు నాణ్యతగా, సక్రమంగానే ఉన్నాయని అన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన వ్యవహారం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చేస్తున్న పనులు తుగ్లక్‌ చర్యలుగా ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ వ్యక్తిగత భవనాలను నిర్మించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కొత్త భవనాలు నిర్మిస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

కేసీఆర్ నయా తుగ్లక్ చర్యలు

కాంగ్రెస్‌ నేతలు సోమవారం  ఉదయం సచివాలయ భవనాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పాలనపై ధ్వజమెత్తారు. ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని భట్టి విక్రమార్క కోరారు. ప్రజాధనం వృథా కావొద్దనేదే తమ అభిప్రాయమని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు అన్నారు. సచివాలయానికి వచ్చి భవనాలను పరిశీలించిన తర్వాతే కొత్త నిర్మాణంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ భవనాలను సందర్శించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాగార్జున సాగర్‌లో నిర్వహించిన సమావేశం సందర్భంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎల్పీలో సమావేశమైన పలువురు నేతలు సోమవారం ఉదయం సచివాలయం వద్దకు వచ్చారు. సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ భవనాలను సందర్శించిన వారిలో.. భట్టి విక్రమార్కతో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment