Breaking News

02/07/2019

ముంబైలో రికార్డ్ స్థాయిలో వానలు


ముంబై, జూలై 2, (way2newstv.com)
ముంబై ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇవాళ కూడా భారీ స్థాయిలో వ‌ర్షాలు కురువ‌నున్నాయి. భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో ప్ర‌భుత్వం ఇవాళ సెలవు ప్ర‌క‌టించింది. ముంబై సిటీ, ముంబై స‌బ‌ర్బ‌న్‌, థానే జిల్లాల్లో ఇవాళ ప్ర‌భుత్వ స్కూళ్లు, కార్యాల‌యాల‌కు సెలవు ప్ర‌క‌టించారు. ఐఎండీ వార్నింగ్ నేప‌థ్యంలో సెలవు ప్ర‌క‌టించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ మాత్రం ప‌నిచేస్తుంద‌ని బీఎస్ఈ సీఈవో ఆశిశ్ కుమార్ తెలిపారు. సాధార‌ణ ప‌ద్ధ‌తిలోనే స్టాక్ మార్కెట్లు న‌డుస్తాయ‌న్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ముంబై తీరం వెంట భారీ స్థాయిలో అల‌లు ఎగిప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. సుమారు 5 మీట‌ర్ల మేర ఎత్తున అల‌లు ఎగిసిప‌డుతాయ‌ని ఐఎండీ అధికారులు చెప్పారు. ఐఎండీ శాటిలైట్ చిత్రాన్ని విడుద‌ల చేసింది. మ‌హారాష్ట్ర‌లోని ముంబై తీరం ద‌ట్ట‌మైన మేఘాల‌తో క‌మ్ముకుని ఉన్న‌ది. ముంబైతో పాటు ద‌క్షిణ గుజ‌రాత్‌లో భీక‌రంగా వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయి.


ముంబైలో రికార్డ్ స్థాయిలో వానలు

16 మందిని పొట్టన పెట్టుకున్న వానలు ముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు 16 మందిని పొట్టునబెట్టుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కట్టడాలు కూలుతున్నాయి. తాజాగా మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాదలో గోడకూలి 12 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రులు కాండ్వాలీలోని శతాబ్ది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ముంబై సమీపంలోని కల్యాణ్‌లో పాఠశాల గోడ కూలి ఓ మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగుర్ని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు, భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురాతన భవనాలు పక్క గుడిసెల్లో నివస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోకల్ రైళ్లను నిలిపివేశారు. 54 విమాన సర్వీసులను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. గతేడాది నల్లాస్‌పొరలో 72 గంటల పాటు 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దీన్ని ప్రస్తుత వర్షాలు అధిగమించాయి. గడిచిన 72 నుంచి 75 గంటల్లో 1000 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 200 మి.మీ. అధికం. ముంబైలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముంబైలోని రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. కింగ్ సర్కిల్‌లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. జులై 3 నుంచి 5 వరకు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరికలు జారీచేసింది

No comments:

Post a Comment